ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంచైనా చెడైనా పాక్ వెంటే ఉంటాం,,,టర్కీ ప్రెసిడెంట్

international |  Suryaa Desk  | Published : Wed, May 14, 2025, 08:54 PM

పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ ప్రారంభించింది. ఇలాంటి ఈ తరుణంలో టర్కీ, పాకిస్థాన్‌కు మద్దతుగా నిలిచింది. పైగా భారత్‌పై దాడులకు తెగబడిన పాకిస్థాన్‌కు.. ఆయుధ సహకారం అందించింది. టర్కీ నుంచి పెద్ద సంఖ్యలో డ్రోన్లు పాక్‌కు రవాణా చేసింది. తాజాగా మరిన్ని విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. టర్కీ పాకిస్థాన్‌కు కేవలం డ్రోన్ల సాయమే కాకుండా సైనిక సిబ్బందిని కూడా తరలించినట్లు తెలుస్తోంది. దాంతో సోషల్ మీడియాలో బాయ్‌కాట్ టర్కీ ట్రెండింగ్‌లో ఉంది. ఇలా ఉండగా తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. టర్కీ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ నిజమైన స్నేహానికి నిదర్శనంగా నిలుస్తుందన్నారు. ఆ వివరాలు..


కాల్పుల విరమణ నేపథ్యంలో టర్కీకి ధన్యవాదాలు తెలిపిన పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ను.. ఆ దేశ ప్రెసిడెంట్ ఎర్డోగాన్ అభినందించారు. అంతేకాక నిజమైన స్నేహానికి నిదర్శనం పాకిస్థాన్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పైగా మంచైనా, చెడైనా పాక్ వెంటే ఉంటామని.. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తన ఆప్త మిత్రుడని ఎర్డోగాన్ ప్రకటించారు. భవిష్యత్తులో పాకిస్థాన్‌కు ఎలాంటి సాయం కావాలన్నా చేస్తామని తెలిపారు. టర్కీ చర్యల వల్ల భారతీయులు ఇప్పటికే ఆ దేశం మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. సోషల్ మీడియాలో బాయ్‌కాట్ టర్కీ ట్రెండింగ్‌లో ఉండగా.. ఎర్డోగాన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.


ఇక ఆపరేషన్ సిందూర్‌పై పాకిస్థాన్ చేస్తోన్నతప్పుడు ప్రచారానికి టర్కీ, చైనాలు మద్దతు పలుకుతున్నాయి. ఈ క్రమంలో ఈ రెండు దేశాలకు భారత్ షాక్ ఇచ్చింది. ఈరెండు దేశాలకు సంబంధించిన అధికారిక సోషల్ మీడియాపై ఇండియా నిషేధం విధించింది. టర్కిష్ బ్రాడ్‌కాస్టర్ 'TRT వరల్డ్' ఎక్స్ ఖాతాను బ్యాన్ చేసింది.


పుణేలోని వ్యాపారులు టర్కీ నుంచి దిగుమతి చేసుకున్న యాపిల్స్‌ను బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు. టర్కీ, పాకిస్థాన్‌కు మద్దతు తెలుపుతోందని.. ఆ దేశం ఉగ్రవాదానికి ప్రోత్సాహం అందిస్తోందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని వ్యాపారులు తెలిపారు. ఈనిర్ణయం వల్ల టర్కీ 1500 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని సమాచారం. భారత్ ఇన్ని చర్యలు తీసుకుంటున్నా సరే టర్కీ మాత్రం.. పాక్‌కు బహిరంగంగానే మద్దతు తెలపడం గమనార్హం. మరి తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి అంటున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com