ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టర్కీ ఇనోను వర్సిటీతో జేఎన్‌యూ అవగాహన ఒప్పందం సస్పెండ్

international |  Suryaa Desk  | Published : Wed, May 14, 2025, 09:50 PM

జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం  కీలక నిర్ణయం తీసుకుంది. టర్కీకి చెందిన ఇనోను విశ్వవిద్యాలయంతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాన్ని  తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు, ఈ వివాదంలో పాకిస్థాన్‌కు టర్కీ బాహాటంగా మద్దతు ఇస్తున్న నేపథ్యంలో జేఎన్‌యూ తీసుకున్న ఈ చర్య ప్రాధాన్యతను సంతరించుకుంది.జేఎన్‌యూ, టర్కీలోని ఇనోను విశ్వవిద్యాలయం మధ్య ఈ ఏడాది ఫిబ్రవరి 3వ తేదీన అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం మూడేళ్ల పాటు, అంటే 2028 ఫిబ్రవరి 2 వరకు అమల్లో ఉండాల్సిందని జేఎన్‌యూ అధికారిక వెబ్‌సైట్ పేర్కొంది. అయితే, బుధవారం నాడు జేఎన్‌యూ తన అధికారిక 'ఎక్స్' ఖాతా ద్వారా ఈ ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది."జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా, టర్కీలోని ఇనోను విశ్వవిద్యాలయంతో జేఎన్‌యూ కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు నిలిపివేయబడింది. జేఎన్‌యూ దేశానికి అండగా నిలుస్తుంది" అని ఆ పోస్టులో స్పష్టం చేసింది.భారత్‌కు వ్యతిరేకంగా తప్పుడు సమాచారం, దుష్ప్రచారం చేస్తుందన్న ఆరోపణలపై టర్కీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని వార్తా సంస్థ 'టీఆర్టీ వరల్డ్' ఎక్స్ ఖాతాలను భారత ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసిన రోజే జేఎన్‌యూ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇటీవలి కాలంలో భారత్‌లో టర్కీ ఉత్పత్తులు, సేవలను బహిష్కరించాలనే డిమాండ్ కూడా ఊపందుకుంది.'ఆపరేషన్ సిందూర్' సమయంలో భారత్‌కు వ్యతిరేకంగా టర్కీ, అజర్‌బైజాన్‌లు వ్యవహరించిన తీరు పట్ల నిరసనగా, ఆ దేశాలకు వెళ్లేందుకు భారతీయ పర్యాటకులు పెద్ద ఎత్తున తమ ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారని, కొత్త బుకింగ్‌లు గణనీయంగా తగ్గాయని ప్రముఖ ఆన్‌లైన్ ట్రావెల్ బుకింగ్ సంస్థలు మేక్‌మైట్రిప్, ఈజ్‌మైట్రిప్ వెల్లడించాయి






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com