కడప జిల్లాలో ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న రామ్మోహన్ రెడ్డి.. ఏకాంతంగా ఉన్న లవర్స్ను టార్గెట్గా చేసుకుని.. డబ్బులు దండుకోవడం.. ఒక ప్రాణాన్ని బలి తీసుకుంది. ప్రేమికులు కలిసి ఉండగా ఫోటోలు తీసి.. వారిని డబ్బులు డిమాండ్ చేసేవాడు. ఎక్కడైనా ప్రేమజంట కనిపిస్తే చాలు వారిని భయపెట్టి అందినకాడికి దోచుకోవడమే పనిగా పెట్టుకున్నాడు. ఈ దోపిడీకి ఒక అనుచరుడు కూడా ఉన్నాడు. అనిల్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి.. తాను కానిస్టేబుల్ అంటూ చెప్పుకుని తిరుగుతున్నాడు. వీరిద్దరూ కలిసి ప్రేమికులను భయపెట్టి, బెదిరించి, వేధింపులకు గురి చేసే మరీ డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. అయితే ఆ వేధింపులకు ఓ బీటెక్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడటంతో ఈ వ్యవహారం బయటికి వచ్చింది. తాజాగా అన్నమయ్య జిల్లా రాజంపేట పోలీసులు అనిల్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేయగా.. ఆ తర్వాత రామ్మోహన్ రెడ్డిని సస్పెండ్ చేశారు.
కడప ఏఆర్ విభాగంలో కె. రామ్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కానిస్టేబుల్గా పని చేస్తున్నాడు. ప్రొద్దుటూరుకు చెందిన తన బంధువు అనిల్ కుమార్ రెడ్డిని పాలకొండల్లో అనధికారికంగా నియమించుకున్నాడు. దీంతో అక్కడికి వచ్చే ఒంటరి మహిళలు, ప్రేమజంటలను టార్గెట్ చేస్తూ అనిల్ కుమార్ రెడ్డి ఫొటోలు తీసి, వారి ఫోన్ నంబర్లు తీసుకుని వివరాలు రామ్మోహన్ రెడ్డికి పంపేవాడని తెలుస్తోంది. వెంటనే రామ్మోహన్ రెడ్డి పాలకొండలకు వచ్చి వారికి ఫోటోలు చూపించి భయపెట్టడంతో పాటు వారి తల్లిదండ్రులకు చెబుతానని భయపెట్టి.. అందినకాడికి దోచుకునేవాడని పోలీసుల విచారణలో తేలింది.
ఈ క్రమంలోనే అనంతపురం జిల్లాకు చెందిన బీటెక్ విద్యార్థిని రాజంపేట అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 3వ తేదీన ఫ్రెండ్స్తో కలిసి పాలకొండలకు వెళ్లింది. వారి ఫొటోలు అనిల్ తీయగా.. రామ్మోహన్ రెడ్డి వెళ్లి భయపెట్టాడు. దీంతో వారు రూ.4 వేలు ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత మళ్లీ వేధింపులకు గురి చేయడంతో మరో రూ.10 వేలు ఇచ్చారు. అయినా ఆశ తీరని రామ్మోహన్ రెడ్డి.. ఇంకా డబ్బుల కోసం ఒత్తిడి చేయడంతో ఫిబ్రవరి 5వ తేదీన ఆ యువతి.. తాను ఉంటున్న లేడీస్ హాస్టల్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
డబ్బులు ఇవ్వకపోవడంతో అనిల్ కుమార్ రెడ్డి.. ఆ విద్యార్థిని తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో ఆమె మనస్తాపానికి గురై ప్రాణాలు తీసుకుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. అనిల్ కుమార్ రెడ్డిన అరెస్ట్ చేశారు. విచారణలో అతను చెప్పిన దాని ప్రకారం ఏఆర్ కానిస్టేబుల్ రామ్మోహన్ రెడ్డి పేరు బయటికి వచ్చింది. దీంతో అసలు నిజాలు బయటపడ్డాయి. దీంతో కడప జిల్లా ఎస్పీ.. కానిస్టేబుల్ రామ్మోహన్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేశారు.
![]() |
![]() |