ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్‌కు బిగ్ షాకిచ్చిన ట్రంప్ సర్కార్.. రూ.కోట్లల్లో నష్టం, మామిడిపండ్లు వెనక్కి

international |  Suryaa Desk  | Published : Tue, May 20, 2025, 08:15 PM

భారతీయ మామిడి పండ్లకు ప్రపంచవ్యాప్తంగా భలే గిరాకీ ఉంటుంది. భారత్ నుంచి ఎగుమతి అయ్యే మామిడి పండ్లకు విదేశాల్లో భారీగా డిమాండ్ ఉంటుంది. మరీ ముఖ్యంగా భారత్ నుంచి అమెరికా మామిడి పండ్లను భారీ ఎత్తున దిగుమతి చేసుకుంటుంది. అయితే తాజాగా భారతీయ మామిడి ఎగుమతిదారులకు డొనాల్డ్ ట్రంప్ సర్కార్ పెద్ద షాక్ ఇచ్చింది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్, శాన్ ఫ్రాన్సిస్కో, అట్లాంటా వంటి వివిధ ఎయిర్‌పోర్టుల్లో భారత్ నుంచి వచ్చిన 15 మామిడి షిప్‌మెంట్‌లను అమెరికా అధికారులు వద్దని తిరస్కరించారు. డాక్యుమెంటేషన్‌లో లోపాలు ఉన్నాయని పేర్కొంటూ భారతీయ మామిడి షిప్‌మెంట్లపై ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. దీని వల్ల ఎగుమతిదారులకు దాదాపు 5 లక్షల డాలర్లు అంటే మన భారత కరెన్సీలో రూ.4 కోట్ల పైనే నష్టం వాటిల్లుతుందని సంబంధిత అధికారులు అంచనా వేస్తున్నారు.


ఈ మామిడి షిప్‌మెంట్‌లకు సంబంధించిన డాక్యుమెంటేషన్‌లో తప్పులు ఉన్నట్లు అమెరికా అధికారులు కనుగొన్నారు. ముఖ్యంగా మామిడి పండ్లు ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు తప్పనిసరిగా చేయాల్సిన ఇర్రాడియేషన్ ప్రక్రియకు సంబంధించిన పత్రాల్లో లోపాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇర్రాడియేషన్ అంటే పురుగులను తొలగించడానికి, పండ్ల నిల్వ కాలాన్ని పెంచడానికి పండ్లను నియంత్రిత రేడియేషన్‌కు గురి చేస్తారు. అయితే ఈ ఇర్రాడియేషన్ ప్రక్రియ మే 8వ తేదీ, 9వ తేదీల్లో ముంబైలోని నవీ ముంబైలో ఉన్న యూఎస్‌డీఏ పర్యవేక్షణలోని కేంద్రంలో జరిగింది.


 అయితే తప్పుగా జారీ చేసిన పీపీక్యూ 203 ఫారం కారణంగా ఈ మామిడి పండ్ల షిప్‌మెంట్ ఎంట్రీని అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ తిరస్కరించింది. అమెరికాకు మామిడి పండ్లు ఎగుమతి చేసేందుకు పీపీక్యూ 203 పత్రం చాలా అవసరం. ఇది పురుగుల నియంత్రణకు సంబంధించిన పత్రాల్లో పరిపాలనా లోపాల వల్ల ఏర్పడిందని.. నిజమైన పురుగులు ఉన్నందువల్ల కాదని ఎకనామిక్ టైమ్స్ వెల్లడించింది.


ఇక ఇర్రాడియేషన్ కేంద్రంలో జరిగిన పొరపాట్లకు తాము నష్టపోతున్నామని ఆ మామిడి పండ్లు ఎగుమతి చేసిన వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మే 9 నుంచి 11వ తేదీల్లో లాస్ ఏంజిల్స్ ఎయిర్‌పోర్టులో తమ సరుకును నిలిపివేసి.. ఆ తర్వాత దాన్ని ధ్వంసం చేయాలని అధికారులకు ఆదేశాలు వచ్చాయని మరొక ఎగుమతిదారుడు ఆరోపించాడు. అయితే ఇర్రాడియేషన్ ప్రక్రియ పూర్తయిందని.. పీపీక్యూ 203 ఫారం కూడా ట్రీట్‌మెంట్ తర్వాతే జారీ అయినట్లు ఆ ఎగుమతిదారు స్పష్టం చేశారు. ట్రీట్‌మెంట్ చేయకుండా ఫారం ఎలా వస్తుందని.. యూఎస్‌డీఏ అధికారి జారీ చేసిన ఆ ఫారం లేకుండా ముంబై ఎయిర్‌పోర్టులో మామిడి పండ్ల ఎగుమతులకు క్లియరెన్స్ కూడా లభించదు కదా అని ఆయన ప్రశ్నించారు.


భారత మామిడి షిప్‌మెంట్లను అమెరికా తిరస్కరించడంపై అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్స్ట్ అథారిటీ (ఏపీఈడీఏ) ఛైర్మన్ కార్యాలయం స్పందించింది. ఇది ముంబైలోని వాషిలో ఉన్న యూఎస్‌డీఏ ఆమోదం పొందిన మహారాష్ట్ర స్టేట్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ బోర్డ్ కేంద్రానికి సంబంధించిందని.. వారి నుంచి వివరాలు తెలుసుకోవాలని సూచించింది. అయితే దీనిపై మహారాష్ట్ర స్టేట్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ బోర్డ్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం గమనార్హం. మామిడి పండ్లు త్వరగా పాడైపోయేవి కావడంతో.. ఆ షిప్‌మెంట్‌లను అమెరికాలోనే ధ్వంసం చేయడం లేదా తిరిగి భారత్‌కు పంపడం మాత్రమే ఎగుమతిదారులకు ఇప్పుడున్న ఆప్షన్లు కాగా.. మళ్లీ తిరిగి తీసుకువస్తే అయ్యే ఖర్చులను భరించడం కన్నా అక్కడే ధ్వంసం చేయాలని ఎగుమతిదారులు నిర్ణయించడంతో వారికి తీవ్ర ఆర్థిక నష్టం మిగిలింది.


భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై ప్రభావం?


అయితే తాజా సంఘటన భారత్-అమెరికా మామిడి వాణిజ్య సంబంధాలకు కీలకమైనవని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక త్వరలోనే భారత్ అమెరికాలు ఒక వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని చూస్తుండగా.. ఇలాంటి ఘటన జరగడం సంచలనంగా మారింది. భారత్ జీరో టారిఫ్‌లతో ఒక ఒప్పందాన్ని ఆఫర్ చేసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఈ ఒప్పందానికి సంబంధించిన తొలి దశ రాబోయే నెలల్లో పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు.


ఆ వాణిజ్య ఒప్పందం కింద.. టెక్స్‌టైల్స్, రత్నాలు-ఆభరణాలు, తోలు ఉత్పత్తులు, వస్త్రాలు, ప్లాస్టిక్స్, రసాయనాలు, రొయ్యలు, నూనె గింజలు, ద్రాక్ష, అరటిపండ్లు వంటి అనేక రంగాలకు అమెరికా నుంచి భారత్ టారిఫ్ తగ్గింపులను కోరుతోంది. దీనికి ప్రతిగా.. పారిశ్రామిక ఉత్పత్తులు, ఆటోమొబైల్స్ (ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలు), వైన్‌లు, పెట్రోకెమికల్ ఉత్పత్తులు, డైరీ ఉత్పత్తులు, ఆపిల్ వంటి వ్యవసాయ ఉత్పత్తులు, చెట్టు గింజలతో సహా వివిధ రంగాల్లో సుంకాలు తగ్గించాలని భారత్‌ను అమెరికా కోరుతోంది. ట్రంప్ ప్రతీకార సుంకాలు జూలైలో అమల్లోకి రాకముందే భారత్ అమెరికాతో 3 దశల వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని చూస్తోందని బ్లూమ్‌బెర్గ్ నివేదిక వెల్లడించింది. ఇలాంటి తరుణంలో తాజా మామిడి షిప్‌మెంట్‌ల తిరస్కరణ భారత్-అమెరికా వాణిజ్య చర్చలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com