ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్రం గుడ్‌న్యూస్.. వారందరికీ 4 శాతం రిజర్వేషన్లు

national |  Suryaa Desk  | Published : Fri, May 23, 2025, 08:00 PM

దివ్యాంగుల అభివృద్ధి, సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయాన్ని ప్రకటించింది. జనరల్ పూల్ రెసిడెన్షియల్ అకామిడేషన్ కేటగిరీ కింద.. ప్రభుత్వ ఇళ్ల కేటాయింపులో దివ్యాంగులకు ప్రాధాన్యం కల్పించనుంది. మొత్తం మంజూరైన ఇళ్లలో 4 శాతం దివ్యాంగులకు రిజర్వేషన్ చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు కేంద్ర గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద పనిచేసే ఎస్టేట్స్ డైరెక్టరేట్ ఉత్తర్వులను విడుదల చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 'సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్' (అందరితో కలిసి, అందరి అభివృద్ధి) విజన్ నుంచి ప్రేరణ పొంది.. సమాజంలో అందరి అభివృద్ధి దిశగా ఇది ఒక కీలక మైలురాయి అని కేంద్ర గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది.


ఇక నుంచి కేంద్ర ప్రభుత్వ గృహాల కేటాయింపులో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్ కల్పిస్తారని.. ఆ ప్రకటనలో పేర్కొంది. ఇది ప్రభుత్వ సేవల్లో సమానత్వం, గౌరవం, అందుబాటును పెంచే దిశగా ఒక ముందడుగు అని వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం.. సమాజంలోని ప్రతీ పౌరుడి సాధికారతకు నరేంద్ర మోదీ సర్కార్ కట్టుబడి ఉందనే విషయాన్ని తెలియజేస్తుందని వివరించింది. అంతేకాకుండా సమ్మిళిత, అందుబాటులో ఉండే భారతదేశానికి పునాదిని బలోపేతం చేస్తుందని ఆ ప్రకటనలో మంత్రిత్వ శాఖ తెలిపింది.


అయితే ఈ నిర్ణయం దివ్యాంగుల హక్కుల చట్టం 2016కు అనుగుణంగా తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వ నివాస వసతులకు సమానమైన ప్రాప్యతను నిర్ధారించడానికి ఎస్టేట్స్ డైరెక్టరేట్ ఈ మెమోరాండంను జారీ చేసింది. సమ్మిళిత పాలన దిశగా కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కీలక అడుగు వేశారని కూడా మంత్రిత్వ శాఖ పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా దివ్యాంగులకు ప్రభుత్వ గృహ వసతి మరింత సులభతరం కానుంది.


  దివ్యాంగులు ఇల్లు పొందేందుకు అర్హతలు


కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన యూనిక్ డిజేబిలిటీ ఐడీ(యూడీఐడీ) సర్టిఫికేట్ ఉండాలి. దివ్యాంగులకు వారి వైకల్యాన్ని ధృవీకరించే సర్టిఫికేట్ అని మంత్రిత్వ శాఖ ఎస్టేట్స్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ మే 22వ తేదీన జారీ చేసిన ఆర్డర్‌లో పేర్కొన్నారు. దీనికి ఆ శాఖకు చెందిన కాంపిటెంట్ ఆఫీసర్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కోటా కింద ఇల్లు కోరుకునే దివ్యాంగులు ప్రతి నెలా eSampada వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఉత్తర్వుల్లో తెలిపారు. ప్రతి నెలా ఆటోమేటెడ్ వ్యవస్థ ద్వారా ఈ కేటాయింపులు జరుగుతాయని వెల్లడించారు. దివ్యాంగులుగా నమోదు చేసుకున్న అభ్యర్థులు ప్రతి నెలా eSampada వెబ్‌సైట్‌లో కొత్తగా రూపొందించిన PwD కేటగిరీలో నమోదు చేసుకోవాలని.. ప్రొఫైల్‌ను అప్‌డేట్ చేయడంలో యూడీఐడీ కార్డ్ అప్‌లోడ్ చేయాలని సూచించారు. సంబంధిత శాఖలు వాటిని ధృవీకరించాల్సి ఉంటుందని వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com