వారిద్దరూ ప్రేమించుకున్నారు.. ఒకరిని విడిచి ఒకరం బతకలేమనుకున్నారు. పెళ్లి చేసుకోవాలని భావించారు. తమ ప్రేమ విషయం తల్లిదండ్రులకు చెప్పారు. అందుకు వారు అంగీకరించలేదు. దీంతో ఇద్దరు ఇంట్లో నుంచి బయటకు వచ్చి వివాహం చేసుకున్నారు. వీరికి పెళ్లై రెండేళ్లు. వీరి ప్రేమకు గుర్తుగా ఏడాది వయసున్న బాబు కూడా ఉన్నాడు. అంతా బాగుంది అనుకున్నసమయంలో దంపతులు తీసుకున్న నిర్ణయంతో పాపం పసివాడు అనాథగా మిగిలాడు.
పెద్దలను ఎదిరించి మరీ పెళ్లిచేసుకున్న వారు.. ఆ బంధాన్ని కడవరకు కాపాడుకోలేకపోయారు.పైగా చిన్న వయసులోనే వివాహం చేసుకున్నారు. ఆ అమ్మాయి డిగ్రీ చేస్తుంది. అబ్బాయి పనీపాటలేకుండా తిరగడమే కాక మద్యానికి అలవాటుపడ్డాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు. ఈక్రమంలో క్షణికావేశంలో.. బిడ్డ గురించి కూడా ఆలోచించకుండా దంపతులు ఆత్మహత్యాప్రయత్నం చేశారు. ఈ ఘటనలో భార్య మరణించగా.. భర్త తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పాపం తల్లిదండ్రులు లేరని తెలియని చిన్నారి.. వారి కోసం గుక్కపట్టి ఏడుస్తుంటే చూసిన వారంతా కన్నీటిపర్యంతం అవుతున్నారు. ఈ విషాదకరం సంఘటన వివరాలు..
ఈ సంఘటన హైదరాబాద్ , ఘట్కేసర్ పరిధిలో చోటు చేసుకుంది. మేడిపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అంబర్పేట ప్రేమ్నగర్కు చెందిన పి.మధు, సుగుణ దంపతులకు ఒక కుమార్తె దీపిక(18) ఉంది. అయితే కొన్నాళ్ల క్రితం దీపికకు అదే ప్రాంతానికి చెందిన సంతోష్తో పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలని భావించిన దీపిక, సంతోషలు ఆ విషయాన్ని తల్లిదండ్రలుకు చెప్పారు. అయితే వారి కులాలు వేరు కావడంతో వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు.
దీంతో రెండేళ్ల క్రితం వీరిద్దరూ ఇంటి నుంచి వచ్చేసి కులాంతర వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఏడాది వయసున్న దేవాన్ష్ అనే కొడుకు ఉన్నాడు. దీపిక కాలేజీకి వెళ్తుంది. ఇక పెళ్లైన కొత్తలో వీరద్దరూ బాగానే ఉన్నప్పటికీ.. ఈమధ్య కాలంలో దంపతుల మధ్య తరచుగా గొడవలు అవుతున్నాయి. పైగా సంతోష్ మద్యానికి బానిసై భార్యాబిడ్డలను పట్టించుకోవడంమానేశాడు. పని చేయకుండా బలదూర్గా తిరగడం ప్రారంభించాడు. ఈ విషమై భార్యాభర్తల మధ్య గొడవలు పెరిగాయి. కొన్ని రోజుల క్రితమే కుల పెద్దల మధ్య పంచాయతీ కూడా పెట్టారు.
వారు దీపికను తన తల్లిదండ్రుల వద్ద ఉండాలని చెప్పడంతో.. ఆమె పుట్టింటికి వచ్చింది. ఈక్రమంలో బుధవారం నాడు దీపిక కాలేజ్కి వెళ్లిందని తెలుసుకున్న సంతోష్ అక్కడికి వచ్చి ఆమెను వేధించాడు. ఆ తర్వాత రాత్రి దీపిక తల్లిదండ్రులు ఉంటున్న ఇంటికి వచ్చాడు సంతోష్. అనంతరం భార్యను గదిలోకి తీసుకెళ్లి.. తన వెంట రావాలని ఒత్తిడి చేశాడు. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో.. విచక్షణ కోల్పోయిన సంతోష్.. తన వెంట తెచ్చుకున్న బ్లేడుతో శరీరంపై కోసుకున్నాడు. ఇది చూసి భయపడిపోయిన దీపిక.. భర్త ఎదుటే ఫ్యాన్కు ఉరి వేసుకుంది.
ఇది గమనించిన సంతోష్ భయంతో కేకలు వేశాడు. దీంతో కుటుంబ సభ్యులు పరుగున వచ్చి చూడగా.. దీపిక ఫ్యాన్కు వేలాడుతు కనిపించింది. ఇరుగు పొరుగు సాయంతో కుటుంబ సభ్యులు రూమ్ డోర్ పగులకొట్టారు. దీపికను కిందకు దించారు. కానీ ఆమె అప్పటికే చనిపోయింది. ఇక సతీష్కు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa