ఇరాన్పై ఇజ్రాయేల్ దాడులతో పశ్చిమాసియాలో పరిస్థితులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇరాన్ అణుస్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయేల్ సైన్యం శుక్రవారం దాడులు మొదలుపెట్టింది. ఇరాన్ అణు ఆయుధ ప్రాజెక్టును లక్ష్యంగా చేసుకుని విస్తృతమైన దాడులను చేపట్టినట్లు ఇజ్రాయేల్ రక్షణ దళాలు (IDF) ప్రకటించాయి. ఈ దాడుల్లో టెహ్రాన్లోని ఇరాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయం, SPND అణు ప్రాజెక్ట్ ప్రధాన కేంద్రం, అలాగే ఇరాన్ అణ్వాయుధాలను దాచిన ప్రదేశంను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు IDF ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.
అటు, ఇజ్రాయేల్ మిసైల్ దాడిలో టెహ్రాన్లోని షహ్రాన్ ఆయిల్ డిపోను లక్ష్యంగా చేసుకుందని ఇరాన్ పేర్కొంది. అంతేకాదు, టెహ్రాన్ సమీపంలోని ఆయిల్ శుద్ధి కేంద్రంపై కూడా ఇజ్రాయేల్ దాడిచేసిందని పేర్కొంది. శనివారం నాటి ఇజ్రాయేల్ దాడితో ప్రపంచంలో అతిపెద్ద గ్యాస్ ఉత్పత్తి కేంద్రమైన సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్లో ఉత్పత్తిని నిలిపివేశారు. ఇక, ఇజ్రాయేల్ దాడులకు ముందే అప్రమత్తమైన అమెరికా.. పశ్చిమాసియాలోని తన సిబ్బందిని ప్రమాదకర స్థావరాల నుంచి వెనక్కి తీసుకొచ్చేసింది.
ఇరాన్ ప్రతిదాడులు:
మరోవైపు, ఇరాన్ కూడా ఇజ్రాయేల్పై ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయేల్ నగరాలైన జెరూసలేం, టెల్ అవీవ్లో వైమానిక హెచ్చరికలు మోగాయి. ఇక, ఇరాన్ మిసైళ్ల దాడుల్లో కనీసం ఐదుగురు మృతిచెందినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రకారం.. ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు ఇజ్రాయేల్ ఇంధన సౌకర్యాలు, యుద్ధ విమానాలకు అవసరమైన ఇంధన ఉత్పత్తి కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నాయి. ప్రపంచంలోనే అత్యంత ప్రమాణికమైన గగనతల రక్షణ వ్యవస్థగా గుర్తింపు పొందదిన ఇజ్రాయేల్ ఐరన్ డోమ్ కూడా ఇరాన్ క్షిపణులను అడ్డుకోలేకపోయింది.
ఆపరేషన్ రైజింగ్ లయన్
ఇరాన్పై ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇజ్రాయేల్ శుక్రవారం నాడు దాడులు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇరాన్ అణు, సైనిక కేంద్రాలపై దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఇరాన్ కీలక అణు శాస్త్రవేత్తలు, సైనికాధికారులు, అణు ప్రాజెక్టు నిపుణులు హతమయ్యారు. ఇరాన్లోని ఐక్యరాజ్యసమితి రాయబారి ప్రకారం, ఈ దాడుల్లో 78 మంది మరణించారని, 320 మందికి పైగా గాయపడినట్లు చెప్పారు.
యుద్ధంపై నెతన్యాహూ ప్రకటన
ఇజ్రాయేల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ప్రకారం.. ఈ ఆపరేషన్ ‘ఇజ్రాయేల్ ఆత్మరక్షణ చర్య’గా పేర్కొన్నారు. ‘ఈ మిషన్ అనేది ఎంతకాలమైనా సాగుతుంది. మేము ఆయతుల్లా అలీఖమేనీ పాలన కింద ఉన్న ప్రతి కేంద్రాన్ని, ప్రతి లక్ష్యాన్ని దెబ్బతీస్తాం.. ఇప్పటి వరకు వాళ్లు అనుభవించిందే కాదు, ముందున్నది ఇంకా తీవ్రమైనదిగా ఉంటుంది’ అని హెచ్చరించారు.
అమెరికా-ఇరాన్ చర్చలు రద్దు:
ఆదివారం ఒమన్ వేదికగా జరగాల్సిన అమెరికా-ఇరాన్ అణు చర్చలు రద్దయ్యాయి. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరక్చీ మాట్లాడుతూ.. ఇజ్రాయేల్ అమానుష దాడులు కొనసాగుతుంటే చర్చలు ఎలా జరుగుతాయని అన్నారు. ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్ను హెచ్చరించారు. ‘ఇరాన్ ఇకపై ఒప్పందానికి రావాల్సిందే. లేకపోతే ఇరాన్కు ఏమీ మిగలదు’ అని హెచ్చరించారు.
ఇజ్రాయెల్ నిర్వహించిన విస్తృత దాడుల్లో టెహ్రాన్లోని అణు కేంద్రాలు, ఆయిల్ డిపోలు, గ్యాస్ ఫీల్డులు లక్ష్యంగా మారాయి. ప్రతీకారంగా ఇరాన్ కూడా ఇజ్రాయేల్పై మిసైళ్లు, డ్రోన్ల దాడులు చేసింది. ఈ పరిణామాలు అమెరికా-ఇరాన్ చర్చలను తాత్కాలికంగా అడ్డుకున్నాయి. ఇరాన్పై సాగుతున్న ఈ దాడులు అణు భద్రతా స్థాయిని కుదించే ప్రమాదకరమైన మలుపుగా మారుతున్నాయని అంతర్జాతీయ వర్గాలు అంటున్నాయి.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa