ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తొలి టెస్ట్‌లో భారత్‌పై గెలిచిన ఇంగ్లండ్,,,తేలిపోయిన భారత బౌలర్లు

sports |  Suryaa Desk  | Published : Tue, Jun 24, 2025, 11:39 PM

ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ను భారత్ ఓటమితో ప్రారంభించింది. ఈ సిరీస్‌లో చాలా వరకు ఆతిథ్య జట్టుపై ఆధిక్యం కనబరిచిన టీమిండియా.. చివరి రోజు తేలిపోయి ఓటమిని మూటగట్టుకుంది. ఈజీగా గెలిచే స్థితి నుంచి అనూహ్యంగా తడబడి పరాజయం పాలైంది. 371 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. భారత్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ఐదు వికెట్లు కోల్పోయి ఆడుతూ పాడుతూ ఛేదించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.


ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 471 పరుగులు చేసింది. అనూహ్యంగా 41 పరుగుల వ్యవధిలోనే ఏడు వికెట్లు కూల్పోయి.. తక్కువ స్కోరుకే పరిమితమైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్.. 465 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు ఆరు పరుగుల లీడ్ లభించింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్, రిషభ్ పంత్‌లు సెంచరీలు చేయడంతో ఇంగ్లాండ్‌కు 400లకు పైగా లక్ష్యం నిర్దేశించేలా భారత్ కనిపించింది. కానీ తొలి ఇన్నింగ్స్‌లో మాదిరిగానే అనూహ్యంగా కుప్పకూలింది. 31 పరుగులకు ఆఖరి ఆరు వికెట్లు కోల్పోయింది. ఇంగ్లాండ్ ముందు 371 పరుగుల లక్ష్యం నిలిపింది.


నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 21/1తో నిలిచింది. చివరి రోజు ఆ జట్టు విజయానికి 350 పరుగులు అవసరం. దీంతో చివరి రోజు భారత బౌలర్లు రాణిస్తారని.. జట్టును గెలిపిస్తారని టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ ఆశపడ్డారు. కానీ గెలిపించడం పక్కన బెడితే.. మన బౌలర్లు కనీస పోటీ ఇవ్వలేకపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన బుమ్రా.. రెండో ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అతడి బౌలింగ్‌లో జాగ్రత్తగా ఆడిన ఇంగ్లీష్ ప్లేయర్లు.. మిగతా బౌలర్లపై ఎదురుదాడికి దిగారు.


ఆ జట్టు ఓపెనర్లు తొలి వికెట్‌కు 188 పరుగులు జోడించారు. ఆ తర్వాత శార్దూల్ ఠాకూర్, ప్రసిద్ధ్ కృష్ణ స్వల్ప వ్యవధిలో రెండేసి వికెట్లు తీసి భారత శిబిరంలో ఆశలు రేపారు. కానీ అజేయ హాఫ్ సెంచరీతో జో రూట్ ఇంగ్లాండ్‌కు విజయాన్ని అందించాడు. దీంతో 5 వికెట్ల తేడాతో మ్యాచ్‌లో గెలిచిన ఇంగ్లాండ్.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. బెన్ డకెట్ 149 పరుగులతో ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa