ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అదరగొట్టిన మహిళా జట్టు,,,,స్మృతి మంధాన మెరుపు సెంచరీ

sports |  Suryaa Desk  | Published : Sat, Jun 28, 2025, 10:41 PM

టీమిండియా మహిళల క్రికెట్‌లో స్మృతి మంధాన రికార్డు క్రియేట్ చేసింది. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో సెంచరీ చేసిన స్మృతి మంధాన.. భారత్ తరఫున అన్ని ఫార్మాట్‌లలో సెంచరీ చేసిన తొలి మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది. 51 బంతుల్లోనే మూడంకెల మార్కును అందుకుని ఈ ఫీట్ సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్‌.. ఇంగ్లాండ్ జట్టును చిత్తుగా ఓడించి.. పర్యటనను విజయంతో ఆరంభించింది.


నాటింగ్‌హామ్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ఫస్టు బౌలింగ్ ఎంచుకుంది. రెగ్యులర్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌ గాయంతో ఈ మ్యాచ్‌కు దూరమైంది. ఆమె ప్లేసులో స్మృతి మంధాన సారథ్య బాధ్యతలు చేపట్టింది. షెఫారీ వర్మతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన మంధాన.. బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. షెఫాలీ వర్మ భారీ షాట్లు ఆడేందుకు ఇబ్బంది పడ్డా.. ఈ లెఫ్ట్ హ్యాండర్ మాత్రం ఈజీగా పరుగులు రాబట్టింది. ఈ క్రమంలోనే కేవలం 51 బంతుల్లోనే శతక్కొట్టింది. మొత్తంగా 62 బంతుల్లో 112 పరుగులు స్కోరు చేసింది.


ఈ సెంచరీతో మంధాన పలు రికార్డులు బద్దలు కొట్టింది. భారత్ తరఫున మూడు ఫార్మాట్‌ (టెస్టు, వన్డే, టీ20)లలో సెంచరీలు సాధించిన తొలి మహిళా క్రికెటర్‌గా నిలిచింది. భారత్ తరఫున టీ20ల్లో సెంచరీ చేసిన తొలి మహిళా క్రికెటర్ కూడా మంధాననే కావడం గమనార్హం. ఓవరాల్‌గా మహిళా క్రికెట్‌లో మూడు ఫార్మాట్‌లలో సెంచరీ చేసిన ఐదో ప్లేయర్‌గా మంధాన నిలిచింది.


 స్మృతి మంధాన సెంచరీతో విరుచుకుపడటంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో ఇంగ్లాండ్ 113 పరుగులకే కుప్పకూలింది. 14.5 ఓవర్లలోనే ఇంగ్లండ్ 113 పరుగులకు ఆలౌటైంది. నాట్ సీవర్ 66 పరుగులు చేశారు.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. భారత బౌలర్లలో శ్రీ చరణి నాలుగు వికెట్లు పడగొట్టగా.. దీప్తి శర్మ, రాధా యాదవ్ చెరో రెండు వికెట్లు, అమన్‌జ్యోత్, అరుంధతి రెడ్డి చెరో వికెట్ పడగొట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa