పర్యాటక రంగంలో కస్టమర్ సేవలపై చెన్నై వినియోగదారుల కోర్టు ఒక చరిత్రాత్మకమైన తీర్పును వెలువరించింది. ఇండోనేషియాలో హనీమూన్ కోసం వెళ్లిన ఒక డాక్టర్ దంపతుల జంట.. పర్యాటక సంస్థ నిర్లక్ష్యం కారణంగా మరణించారంటూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపింది. ఈ సందర్భంగానే తీర్పును ఇస్తూ.. సదరు పర్యాటక సంస్థకు రూ.1.7 కోట్లు పరిహారంగా చెల్లించమని ఆదేశాలు జారీ చేసింది.
అసలేం జరిగిందంటే..?
డాక్టర్ విభూష్నియా, డాక్టర్ లోకేశ్వరన్ అనే దంపతులు తమ హనీమూన్ కోసం గ్లోబల్ టూర్స్ (GT) హాలిడేస్ అనే పర్యాటక సంస్థ ద్వారా ఇండోనేషియాలోని బాలి దీవులకు వెళ్లారు. అక్కడ ఒక పర్యటనలో భాగంగా సముద్రంలో మోటార్ బోట్లో ఫోటోషూట్ చేయిస్తుండగా.. పర్యాటక మార్గదర్శి నిర్లక్ష్యం వల్ల వారు నీటిలో పడిపోయారు. ఈ ప్రమాదంలో ఆ దంపతులిద్దరూ దురదృష్టవశాత్తూ మరణించారు. ఈ విషాదకర ఘటన తర్వాత మరణించిన డాక్టర్ విభూష్నియా తండ్రి తిరుజ్ఞాన సెల్వం.. తమ కూతురు, అల్లుడి మృతికి పర్యాటక సంస్థ నిర్లక్ష్యమే కారణమంటూ చెన్నై సౌత్ జిల్లా వినియోగదారుల కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారు.
ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం.. GT హాలిడేస్ కంపెనీ వాదనలను తోసిపుచ్చింది. దంపతుల మరణానికి ఇన్సూరెన్స్ లేకపోవడం, కంపెనీ సూచనలను పాటించకపోవడం వల్ల జరిగిందని పర్యాటక సంస్థ వాదించినప్పటికీ.. కోర్టు ఆ వాదనను తిరస్కరించింది. పర్యాటక సంస్థ అందించిన సేవల్లో లోపాలు ఉన్నాయని, ఇదే మరణాలకు ప్రధాన కారణమని కోర్టు స్పష్టం చేసింది. తీర్పులో భాగంగా మరణించిన దంపతుల కుటుంబానికి రూ.1.60 కోట్లు పరిహారంగా చెల్లించాలని GT హాలిడేస్ను ఆదేశించింది. అంతేకాకుండా ఈ ఘటన వల్ల మానసిక వేదనకు గురైన తిరుజ్ఞానసెల్వంకు అదనంగా రూ.10 లక్షలు చెల్లించాలని కూడా కోర్టు స్పష్టం చేసింది. మొత్తం కలిపి రూ.1.70 కోట్లు పరిహారం చెల్లించాల్సిందిగా తీర్పులో పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa