ప్రభుత్వ పథకాలకు నాయకుల పేర్లను పెట్టే సంప్రదాయంపై మద్రాస్ హైకోర్టు ఒక సంచలన తీర్పును వెలువరించింది. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ పేరుతో నడుస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రచార కార్యక్రమాల్లో ఆయన పేరు, ఫోటోలతో పాు మాజీ సీఎం కరుణానిధి ఫొటోలు వాడటంపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రజాధనంతో నడిచే పథకాలు రాజకీయాలకు అతీతంగా ఉండాలని.. ఏ రాజకీయ నాయకుడి వ్యక్తిగత ప్రచారం కోసం వాటిని ఉపయోగించకూడదని స్పష్టం చేసింది. ఈ తీర్పు తమిళనాడు రాజకీయాలలో ఒక కొత్త చర్చకు దారి తీసింది.
అన్నాడీఎంకే ఎంపీ సి.వి. షణ్ముగం దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం పై హైకోర్టు ఈ ఆదేశాలను జారీ చేసింది. షణ్ముగం తన పిటిషన్లో.. 'ఉంగలుడన్ స్టాలిన్' వంటి పథకాలకు మాజీ సీం కరుణానిధి, ప్రస్తుత ముఖ్యమంత్రి పేరును వాడటం, ప్రచార సామగ్రిలో ఆయన ఫోటోలను ప్రచురించడం ద్వారా అధికార పార్టీ అనవసరమైన రాజకీయ లబ్ధి పొందుతోందని ఆరోపించారు. ఇది సుప్రీంకోర్టు ఆదేశాలకు, 'ప్రభుత్వ ప్రకటనల (కంటెంట్ నియంత్రణ) మార్గదర్శకాలు, 2014'కు విరుద్ధమని ఆయన కోర్టుకు తెలియజేశారు.
అయితే తమిళనాడు ప్రభుత్వం తరపున వాదించిన సీనియర్ న్యాయవాది పి. విల్సన్ ఈ పిటిషన్ను రాజకీయ ప్రేరేపితమైనదిగా కొట్టిపారేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేరుతో 'నమో', మాజీ ముఖ్యమంత్రి జయలలిత పేరుతో 'అమ్మ' వంటి పథకాలు ఉన్నప్పుడు.. ముఖ్యమంత్రి స్టాలిన్, మాజీ సీఎం కరుణానిధి పేరును వాడటం తప్పు ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. ఇది ఒక సాధారణ సంప్రదాయమని వాదించారు. ఇరువైపులా వాదనలు వినన హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎం.ఎం శ్రీవాస్తవ, జస్టిస్ సందర్ మోహన్లతో కూడిన ధర్మాసనం షాకింగ్ తీర్పును ఇచ్చింది.
ముఖ్యమంత్రివి ఓకే.. మాజీలవే వద్దు..!
ప్రభుత్వ ప్రకటనల్లో ముఖ్యమంత్రి ఫొటో ఉపయోగంచవచ్చని.. పార్టీ సైద్ధాంతిక నేతలు, మాజీ ముఖ్యమంత్రులు, జీవించి ఉన్న నేతల ఫొటోలు ఉపయోగించడం సుప్రీం కోర్టుకు వ్యతిరేకం అని పేర్కొంది. ముఖ్యంగా అధికార పార్టీ పేరు, గుర్తు ఉపయోగించడం సుప్రీం కోర్టు, ఎన్నికల కమిషన్ ఉత్తర్వులకు విరుద్ధం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రారంభించనున్న, అమల్లో ఉన్న పథకాలపై ప్రకటనల్లో రాజకీయ నేతల పేరు, మాజీ ముఖ్యమంత్రుల ఫొటోలు ఉపయోగించకూడదని పేర్కొన్నారు. అనంతరం విచారణను ఆగస్టు 13వ తేదీకి వాయిదా వేశారు.
అంతేకాకుండా మద్రాస్ హైకోర్టు ఈ విషయంలో స్పష్టతనిస్తూ.. తాము సంక్షేమ పథకాల అమలును అడ్డుకోవడం లేదని, కేవలం వాటికి పెట్టే పేర్లు, ప్రచార పద్ధతులపై మాత్రమే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని పేర్కొంది. ప్రజల డబ్బుతో నడిచే పథకాలు నిష్పక్షపాతంగా ఉండాలని, వాటిని ఏ రాజకీయ నాయకుడి పేరుతోనూ ముడి పెట్టకూడదని ఆదేశించింది. ముఖ్యంగా జీవించి ఉన్న వ్యక్తుల పేర్లు, ఫోటోలు ప్రచారంలో వాడటం తగదని హైకోర్టు పేర్కొంది. ఈ తీర్పు భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలకు పేర్లు పెట్టే విషయంలో ఒక మార్గదర్శకంగా మారనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa