దేశవ్యాప్తంగా ఉన్న అన్ని విమానాశ్రయాలకు ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు అన్ని విమానాశ్రయాలలో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేయాలని పౌర విమానయాన భద్రతా బ్యూరో (BCAS) ఒక ప్రత్యేక అడ్వైజరీని జారీ చేసింది. పాకిస్థానీ ఉగ్రవాద సంస్థ నుంచి ముప్పు పొంచి ఉన్నట్లు కేంద్ర భద్రతా సంస్థల నుంచి అందిన నిర్దిష్ట సమాచారం ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ అడ్వైజరీ జారీ అయిన తర్వాత విమానాశ్రయాలు, ఎయిర్లైన్స్, రాష్ట్ర పోలీసులతో సహా అన్ని భద్రతా ఏజెన్సీలు అప్రమత్తం అయ్యాయి.
ఈ భద్రతా హెచ్చరికల నేపథ్యంలో.. రన్వేలు, హెలీప్యాడ్స్, ఫ్లైయింగ్ స్కూల్స్, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లలో భద్రత పెంచాలని సూచించింది. ముఖ్యంగా విమానాశ్రయాల్లోకి ప్రవేశించే సిబ్బంది, సందర్శకులకు కఠినమైన గుర్తింపు కార్డు తనిఖీలను తప్పనిసరి చేశారు. అలాగే ప్రయాణికుల తనిఖీలను మరింత కట్టుదిట్టం చేయనున్నారు. విమానాశ్రయ ప్రాంగణంలో ప్రతి కదలికను నిరంతరం పర్యవేక్షించడానికి సీసీటీవీ వ్యవస్థను నిరంతరం ఆన్లైన్లో ఉంచాలని, ఏ చిన్న అనుమానం వచ్చినా వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ఏ చిన్నపాటి నిఘా లోపం కూడా లేకుండా చూసుకోవాలని భద్రతా సంస్థలను ఆదేశించారు. ముఖ్యంగా టెర్మినల్స్, పార్కింగ్ ఏరియా, పెరీమీటర్ జోన్, ఇతర సున్నితమైన ప్రాంతాల్లో పెట్రోలింగ్ను కూడా పెంచారు. స్థానిక పోలీసుల సహకారంతో ఎయిర్ పోర్టులకు వెళ్లే మార్గాల్లోనూ తనిఖీలు చేపట్టేందుకు సిద్ధం అయ్యారు. అంతర్జాతీయ, దేశీయ మార్గాల్లో పంపే మెయిల్ పార్సిళ్లను కూడా క్షుణ్ణంగా సోదా చేస్తున్నారు. సిబ్బంది, కాంట్రాక్టర్లు, విజిటర్స్ను కూడా తనిఖీలు చేయాలని నిర్ణయించారు. విమానాశ్రయాల వద్ద అనుమానాస్పదంగా ఏవైనా లగేజీ బ్యాగులు, వ్యక్తులు కనిపించినా వెంటనే సిబ్బందికి తెలియజేయాలని సూచించారు. ఇప్పటికే ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ను కూడా యాక్టివేట్ చేశారు. అసవరం అయితే ఎయిర్ పోర్టుల్లో మాక్ డ్రిల్స్ చేపట్టాలని పౌర విమానయాన భద్రతా బ్యూరో సంబంధిత అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగానే స్థానిక పోలీసులు, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF), ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) వంటి వివిధ ఏజెన్సీలతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని కూడా సూచించారు. ఈ ఏడాది ఇప్పటికే అనేక విమానాశ్రయాలకు బాంబు బెదిరింపుల రూపంలో నకిలీ హెచ్చరికలు వచ్చాయని, జూలై 20 నాటికి 69 ఇలాంటి కాల్స్ నమోదు అయ్యాయని ఈ అడ్వైజరీ వెల్లడించింది. కానీ ఈసారి వచ్చిన హెచ్చరిక ఒక నిర్దిష్టమైన ఉగ్రవాద ముప్పుకు సంబంధించినది కాబట్టి దీనిని చాలా సీరియస్గా తీసుకోవాలని సూచించింది. దేశంలోని అన్ని విమానాశ్రయాల అధికారులు ఈ హెచ్చరికను పాటించి, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని స్పష్టం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa