ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రష్యా పర్యటనకు అజిత్ దోవల్‌

national |  Suryaa Desk  | Published : Wed, Aug 06, 2025, 08:25 PM

రష్యా నుంచి చమురు కొనుగోళ్ల విషయంలో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశానికి కొత్తగా సుంకాల బెదిరింపులు చేసిన నేపథ్యంలో.. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మాస్కోలో పర్యటించడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికా హెచ్చరికలను ఏమాత్రం లెక్కచేయకుండా భారత్ తన విదేశాంగ విధానాన్ని స్వతంత్రంగా కొనసాగిస్తుందనడానికి ఇది ఒక స్పష్టమైన సంకేతంగా నిలుస్తుండగా అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ పర్యటనలో ఆయన రష్యాతో రక్షణ, ఇంధన సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించారు.


భారత్-రష్యాల మధ్య ఉన్న వ్యూహాత్మక బంధం చాలా కాలం నాటిది. ఉక్రెయిన్‌తో యుద్ధం జరుగుతున్నప్పటికీ.. భారత్ రష్యా నుంచి చమురు, రక్షణ పరికరాలను కొనడాన్ని ఆపలేదు. దీనిపై అమెరికా తరచూ అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉంది. ఇప్పటికే ఆ కోపంతోనే 25 శాతం సుంకాలతో పాటు పెనాల్టీలు కూడా విధించారు. అది చాలదన్నట్లు మంగళవారం రోజే మరింతగా సుంకాలు పెంచుతామంటూ మళ్లీ హెచ్చరికలు జారీ చేశారు. ఈ బెదిరింపుల తర్వాతే అజిత్ దోవల్ మాస్కో పర్యటనకు వెళ్లడం ఒక ముఖ్యమైన పరిణామంగా నిలుస్తోంది. అయితే ఈ పర్యటన ముందే నిర్ణయించినప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల్లో దీనికి అధిక ప్రాధాన్యత ఏర్పడింది.


ఈ పర్యటనలో అజిత్ దోవల్ రక్షణ రంగంలో సహకారం, S-400 క్షిపణి వ్యవస్థలు, Su-57 యుద్ధ విమానాల వంటి అత్యాధునిక ఆయుధాల కొనుగోలుపై చర్చించారు. అంతేకాకుండా ఇంధన భద్రతకు సంబంధించి రష్యా నుంచి చమురు, గ్యాస్ సరఫరాను కొనసాగించడం.. దాని కోసం సురక్షిత మార్గాలను అన్వేషించడం వంటి అంశాలపై కూడా చర్చలు సాగించారు. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా ఈ విషయమై స్పందించింది. రష్యాతో భారతదేశ సంబంధాలు పరస్పర అవగాహన, జాతీయ ప్రయోజనాలపై ఆధారపడి ఉన్నాయని, రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లు సమర్థనీయమేనని స్పష్టం చేసింది. పాశ్చాత్య దేశాలు కూడా రష్యాతో వాణిజ్యాన్ని కొనసాగిస్తున్నాయని, కాబట్టి భారత్‌పై విమర్శలు తగవని పేర్కొంది.


ఆగస్టు నెలలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా రష్యాలో పర్యటించడానికి సిద్ధం అవుతున్నారు. ముఖ్యంగా ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై చర్చించేందుకు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోతో సమావేశం కానున్నారు. ఈ పర్యటన కూడా రక్షణ, ఇంధనం, వాణిజ్య సంబంధాలపై దృష్టి పెట్టనుంది. అజిత్ దోవల్, ఎస్. జైశంకర్ వంటి కీలక నేతల వరుస పర్యటనలు, భారతదేశం తన విదేశాంగ విధానంలో స్వతంత్రతను కాపాడుకోవడానికి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో తెలియజేస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa