సభ్యసమాజం తలదించుకునే అత్యంత కిరాతకమైన నేరానికి పాల్పడిన ఓ కసాయి తండ్రికి న్యాయస్థానం మరణశిక్ష విధించింది. 15 ఏళ్ల కన్న కూతురిపైనే అత్యాచారం చేసి, ఆపై గొంతు నులిమి హత్య చేసిన కేసులో ఈ సంచలన తీర్పు వెలువడింది. పశ్చిమ బెంగాల్లోని పశ్చిమ బర్ధమాన్ జిల్లా అసన్సోల్లో ఉన్న పోక్సో ప్రత్యేక కోర్టు ఈ ఘటన జరిగిన 15 నెలల్లోనే విచారణ పూర్తి చేసి నిందితుడికి ఉరిశిక్ష ఖరారు చేసింది. అసన్సోల్లోని హీరాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సింగ్బంధ్ ప్రాంతంలో గత ఏడాది మే 13న ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. బాలిక తల్లి ఇంటికి వచ్చేసరికి, తన కూతురు మంచంపై పడి ఉండి ముక్కు, చెవుల నుంచి రక్తం కారుతూ కనిపించింది. ఆమె మెడపై కూడా గాయాలున్నాయి. భయంతో తల్లి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. ఆ సమయంలో భర్త తనను ఆసుపత్రికి వెళ్లకుండా అడ్డుకున్నాడని తల్లి ఆరోపించింది. అయితే, స్థానికులు బలవంతంగా బాలికను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు తండ్రిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. పోస్ట్మార్టం నివేదికలో బాలికపై అత్యాచారం జరిగినట్లు, అనంతరం తాడుతో గొంతు బిగించి చంపినట్లు తేలింది. పోలీసులు ఇంటి సమీపంలోని చెత్తకుండీ నుంచి హత్యకు ఉపయోగించిన తాడును కూడా స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసులో 16 మంది సాక్షుల వాంగ్మూలాలు, ఇతర కీలక ఆధారాలను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. ముఖ్యంగా, బాధితురాలి శరీరంపై, దుప్పట్లపై లభించిన డీఎన్ఏ ఆనవాళ్లు నిందితుడైన తండ్రితో సరిపోలడం ఈ కేసులో తిరుగులేని సాక్ష్యంగా నిలిచిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ సోమనాథ్ చట్టరాజ్ తెలిపారు. తల్లి వాంగ్మూలం, దర్యాప్తు అధికారి, వైద్యుల నివేదికలు, ఇతర సాక్ష్యాధారాల ఆధారంగా జడ్జి సుపర్ణ బందోపాధ్యాయ నిందితుడిని దోషిగా నిర్ధారించి, బుధవారం నాడు మరణశిక్ష విధిస్తూ తుది తీర్పును ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa