ఐపీఎల్ 2026కు ముందు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ .. జట్టును వీడుతున్నాడనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇప్పటికే తనను జట్టు నుంచి విడుదల చేయాలని అతడు మేనేజ్మెంట్ను కోరినట్లు తెలుస్తోంది. అయితే 10 ఏళ్లకు పైగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న సంజూ.. ఒక్కసారిగా ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడనేది మాత్రం ఎవరికీ తెలియడం లేదు.
అయితే రాజస్థాన్ రాయల్స్ను సంజూ శాంసన్ ఎందుకు వీడుతున్నాడనే అంశంపై ప్రముఖ క్రికెట్ విశ్లేషకుడు, భారత మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా స్పందించారు. సంజూ శాంసన్ ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను ఆయన విశ్లేషించారు. వైభవ్ సూర్యవంశీ వంటి యువ ఆటగాళ్ల రాక వల్ల జట్టులో తన ప్రాముఖ్యత తగ్గుతోందని సంజూ భావించి ఉంటాడని విశ్లేషించారు.
ఆకాష్ చోప్రా ఏమన్నాడంటే..
“గతంలో సంజు శాంసన్, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ మధ్య అద్భుతమైన కమ్యునికేషన్ ఉండేది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో జోస్ బట్లర్ను కూడా వదులుకోవడానికి సంజూ శాంసన్ కారణమే. ఎందుకంటే అతడు ఓపెనింగ్ చేయాలని అనుకున్నాడు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ రాకతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు తన మాటకు విలువలేదని సంజూ భావించి ఉండవచ్చు”
“సంజూ శాంసన్ గాయంతో కొన్ని మ్యాచ్లకు దూరమయ్యాక వైభవ్ సూర్యవంశీ ఓపెనర్గా జట్టులోకి వచ్చి, అదరగొట్టాడు. ఇప్పటికే ఓపెనింగ్లో ఒక ప్లేసును జైశ్వాల్ సుస్థిరం చేసుకున్నాడు. అందువల్ల సంజూ శాంసన్కు ఓపెనింగ్ అవకాశాలు తగ్గుతాయి. అలాగే ధ్రువ్ జురేల్ను కూడా టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయించాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. ఇవన్నీ కారణాలతో జట్టులో తన ప్రాధాన్యత తగ్గిపోయిందని సంజూ భావించి ఉండొచ్చు” అని ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డారు. అయితే ఇవన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమేనని, రాజస్థాన్ ఫ్రాంచైజీ, సంజూ శాంసన్ మధ్య ఏం జరిగిందో స్పష్టంగా తెలియదని చెప్పుకొచ్చారు. మరోవైపు సంజూ శాంసన్ రాజస్థాన్ రాయల్స్నును వీడనున్నారనే ఊహాగానాల నేపథ్యంలో అతడిని దక్కించుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ ప్రయత్నిస్తున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa