చంద్రబాబు నాయుడు మంత్రివర్గ ఉప సంఘం కూడా ఏర్పాటు చేశారు. ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలో ఏడుగురు మంత్రులతో మంత్రుల కమిటీ ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మంత్రుల కమిటీ ఈ విషయం మీద అధ్యయనం జరపనుంది. అనంతరం సీఎం చంద్రబాబుకు నివేదిక సమర్పిస్తారు. చంద్రబాబు ఆ నివేదికను పరిశీలించిన అనంతరం కేబినేట్ భేటీలో చర్చించి ఆపై నిర్ణయం తీసుకుంటారు. ఇంత ప్రక్రియ జరగాల్సి ఉంది. అయితే మంత్రుల కమిటీ సీఎం చంద్రబాబుకు ఎప్పుడు నివేదిక సమర్పిస్తారనే దానిపై క్లారిటీ వచ్చింది.
గ్రామాలు, మండలాలు, జిల్లాల పేర్లు , సరిహద్దుల మార్పులపై ఏర్పాటైన మంత్రుల కమిటీ తొలిసారిగా బుధవారం సమావేశమైంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమస్యల పరిష్కారంపై కేబినెట్ సబ్ కమిటీ చర్చించింది. అనగాని సత్యప్రసాద్తో పాటుగా మంత్రులు నారాయణ, వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్ధన్ రెడ్డి, సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. వివిధ అంశాలపై చర్చించిన మంత్రులు.. సెప్టెంబర్ 15 నాటికి నివేదికను సీఎం చంద్రబాబుకు అందించాలని నిర్ణయించారు. మరోవైపు డిసెంబర్ 31లోగా జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పుల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే వచ్చే నెల 15వ తేదీ నాటికి ముఖ్యమంత్రి చేతికి నివేదిక అందించనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.
ఇందులో భాగంగా ఆగస్ట్ 29, 30 తేదీల్లో మంత్రుల బృందం ఉమ్మడి జిల్లాలలో పర్యటించనుంది. మంత్రుల కమిటీ రెండు గ్రూపులుగా జిల్లా కేంద్రాల్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. అలాగే ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి వచ్చిన సూచనలు, వినతులను వీటితో కలిపి.. సెప్టెంబర్ 15వ తేదీ నాటికే నివేదికను సీఎంకు అందజేస్తారు. మరోవైపు గ్రామాలు, మండలాలు, జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పులపై ప్రజలు తమ వినతులను జిల్లా కలెక్టర్లకు అందజేయవచ్చు. ఇందుకు సెప్టెంబర్ రెండో తేదీ ఆఖరు అని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. పేర్లు, సరిహద్దుల మార్పు అంశంతో పాటుగా కొత్త జిల్లాల ఏర్పాటు విషయాన్ని కూడా పరిశీలిస్తామని చెప్పారు. అయితే నియోజకవర్గాలతో సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు.
మరోవైపు ప్రజలకు అందుబాటులో ఉండటం, పరిపాలనా సౌలభ్యం, ప్రభుత్వానికి ఆదాయం పెంచటం లక్ష్యంగా మంత్రుల కమిటీ సూచనలు ఉంటాయని అనగాని సత్యప్రసాద్ వివరించారు. మరోవైపు మంత్రుల కమిటీ సమావేశం సందర్భంగా 15 మంది జిల్లా, మండల, గ్రామాల పేర్లు, సరిహద్దుల మార్పుపై కేబినెట్ సబ్ కమిటీకి తమ వినతులను సమర్పించారు. గుంటూరు లేదా పల్నాడు జిల్లాకు గుర్రం జాషువా పేరు పెట్టాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ వినతి పత్రం సమర్పించారు. అలాగే బాపట్ల జిల్లా కేంద్రాన్ని చీరాలకు మార్చాలని కొందరు, బాపట్ల జిల్లాకు దుగ్గిరాల గోపాల క్రిష్ణయ్య పేరు పెట్టాలని మరికొంతమంది కోరారు. ఇక శ్రీకాకుళం జిల్లా మురపాక నుంచి వచ్చిన కొంతమంది గ్రామస్థులు.. తమ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa