సాధారణంగా మనకు నచ్చిన హీరోల సినిమాలో లేదా నచ్చిన కథలతో రాబోతున్న చిత్రాలో వస్తుంటే తొలి రోజే చూడాలని చాలా మంది అనుకుంటుంటారు. ఉద్యోగాలు చేసే వాళ్లు అయితే.. జ్వరం వచ్చిందని, అర్జెంటు పని ఉందంటూ సాకులు వెతుక్కుని మరీ సెలవులు పెట్టి సినిమాకు వెళ్లిపోతుంటారు. కానీ సూపర్ స్టార్ రజినీ కాంత్ నటించిన కూలీ సినిమా చూడాలనుకునే వాళ్లు మాత్రం ఇలాంటి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేకుండా పోయింది. ముఖ్యంగా ఓ సింగపూర్ కంపెనీ.. కూలీ సినిమాకు వెళ్లి రండని తమ సంస్థలోని ఉద్యోగులు అందరితోనూ చెప్పింది. అంతేకాదండోయ్.. ఉచిత సెలవుతో పాటు సినిమా టికెట్లను కూడా ఫ్రీగానే ఇచ్చింది. అద్భుతమైన ఆఫర్ అందుకున్న ఉద్యోగులు అంతా తెగ సంబుర పడిపోతున్నారు. వెంటనే వెళ్లి సినిమా చూసేందుకు సిద్ధమైపోయారు.
సింగపూర్లోని ఫార్మర్ కన్స్ట్రక్షన్స్ పీటీఈ లిమిటెడ్ అనే సంస్థ తమ తమిళ ఉద్యోగులు అందరికీ ఈ బంపర్ ఆఫర్ను ప్రకటించింది. ఈ సంస్థ తమ ఉద్యోగుల సంక్షేమం, ఒత్తిడి నిర్వహణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ పథకం కింద ఉద్యోగులకు సినిమా టికెట్లు మాత్రమే కాకుండా ఆహారం, పానీయాల కోసం ఒక్కొక్కరికి అదనంగా 30 సింగపూర్ డాలర్ల భత్యం కూడా ఇవ్వనుంది. ఈ నిర్ణయం వల్ల ఉద్యోగులు రజనీకాంత్ సినిమాను పూర్తి ఉత్సాహంతో.. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆస్వాదించవచ్చని కంపెనీ పేర్కొంది. ఆగస్టు 14వ తేదీన విడుదల కానున్న ఈ సినిమా కోసం ఉద్యోగులంతా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
రజనీకాంత్ సినిమాల విడుదల అనేది ఒక పండుగలా జరుగుతుంది. అభిమానులు తమ అభిమాన నటుడి సినిమాను చూసేందుకు తెగ ఆరాట పడిపోతుంటారు. ఈ క్రమంలోనే చాలా మంది ఉద్యోగులు సెలవులు అడగడం సర్వసాధారణం. అయితే ఉద్యోగుల ఒత్తిడిని తగ్గించి, వారి ఉత్సాహాన్ని పెంచేందుకు ఫార్మర్ కన్స్ట్రక్షన్స్ సంస్థ తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సంస్థ మాత్రమే కాకుండా సింగపూర్లోని మరో సంస్థ ఎస్బీ మార్ట్ కూడా 'కూలీ' సినిమా కోసం తమ ఆఫీసులకు సగం రోజు సెలవు ప్రకటించింది.
తమిళనాడులో కూడా ఇలాంటి ఆఫరే..
ఇవి మాత్రమే కాకుండా తమిళనాడులోని మదురై కేంద్రంగా పని చేస్తున్న యూనో ఆక్వా కేర్ అనే సంస్థ కూడా ఉచితంగా టికెట్లు ఇవ్వడంతో పాటు సెలవును కూడా మంజూరు చేసింది. చెన్నై, బెంగళూరు, తిరుచ్చి, తిరునెల్వేలి, చెంగల్పట్టు, మాట్టుత్తావణి, ఆరప్పాలళెయం వంటి ప్రాంతాల్లో ఉన్న శాఖలకూ కూడా ఈ నిర్ణయాన్ని వర్తింపజేసింది. అయితే సినిమా విడుదల రోజుల ఆశ్రమాల్లో ఆహార పంపిణీ, విరాళాలు అందించడంతో పాటు ప్రజలకు స్వీట్లు కూడా పంపిణీ చేయబోతున్నట్లు పేర్కొంది.
ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రజనీకాంత్తో పాటు, అక్కినేని నాగార్జున, సత్యరాజ్, అమీర్ ఖాన్, శ్రుతి హాసన్లు నటిస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. విదేశాల్లో రికార్డు స్థాయిలో ఈ సినిమా హక్కులు అమ్ముడుపోయాయి. సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు 'ఎ' సర్టిఫికేట్ ఇచ్చింది, ఇది రజనీకాంత్ను చూసే సాధారణ కుటుంబ ప్రేక్షకులకు కొంత నిరాశ కలిగించినప్పటికీ.. 'కూలీ' సినిమా వందకు పైగా దేశాల్లో విడుదల కానుంది. అదే రోజున హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'వార్ 2' కూడా విడుదల కానుండటంతో బాక్సాఫీస్ వద్ద రసవత్తర పోరు జరగనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa