ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘మాకు చెందాల్సిన నీటిని అడ్డుకుంటే ఇండియాకు మళ్లీ గుణపాఠం నేర్పుతాం’,,పాక్ బెదిరింపులు

international |  Suryaa Desk  | Published : Wed, Aug 13, 2025, 10:14 PM

పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ వంటి చర్యల తర్వాత భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్.. పాక్ మీద కఠిన చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా పాకిస్తాన్‌కు సింధూ నది జలాల పంపిణీని రద్దు చేసింది. భారత్ చర్యలపై పాక్ ఆర్మీ చీఫ్, విదేశాంగ మంత్రులు యుద్ధోన్మాద వ్యాఖ్యలు చేయగా.. విదేశాంగ శాఖ మాత్రమే.. సింధూ జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించాలని సోమవారం నాడు విజ్ఞ‌ప్తి చేసింది. ఇదిలా ఉండగా తాజాగా పాక్ ప్రధాని సింధూ జలాల వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు దక్కాల్సిన నీటి వాటాను నిలిపిస్తే.. ఆ చర్యలను యుద్ధానికి సంకేతంగా తాము భావిస్తామని తెలిపారు.


భారత్ సింధూ నది జలాల పంపిణీ రద్దుపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమకు రావాల్సిన నీటిలో కనీసం ఒక్క చుక్కను కూడా భారత్‌కు ఇవ్వబోమని తేల్చి చెప్పారు. తమకు దక్కాల్సిన నీటిని నిలిపివేస్తే.. ఆ చర్యలను తాము యుద్ధానికి సంకేతంగా భావిస్తామంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియాను శత్రు దేశంగా వర్ణించారు. పాకిస్తాన్‌కు చెందాల్సిన నీటిని అడ్డుకునే చర్యలు తీసుకునే సాహసం చేస్తే.. భారత్‌కు మళ్లీ గుణపాఠం నేర్పుతామంటూ పాక్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు చేశారు.


దీని కన్నా ముందు సింధూ జలాల పంపిణీ రద్దుపై పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి భిలావల్ భుట్టో స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ సింధూ నది జలాలను ఆపితే.. తాము ఇండియా నుంచి ఆరు నదులను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. పాకిస్తాన్‌లోని ప్రతి పౌరుడు భారత్‌తో యుద్ధం కోసం సిద్ధంగా ఉన్నాడని.. అదే పరిస్థితి వస్తే.. ఈ యుద్ధంలో భారత్ ఓడిపోతుందంటూ ప్రేలాపనలు చేశారు. భారత్ సింధూ జలాల ఒప్పందం నిర్ణయాన్ని అలానే కొనసాగిస్తే.. పాక్‌ యుద్ధం గురించి ఆలోచించడం తప్ప మరో మార్గం లేదని చెప్పుకొచ్చారు.


ఇదిలా ఉంటే పాక్ విదేశాంగ శాఖ మాత్రం ఈ అంశంలో భారత్‌ను రిక్వెస్ట్ చేస్తూ వస్తోంది. ఇండియా సింధు జలాల ఒప్పందాన్ని వెంటనే పునరుద్ధరించాలని.. ఈబాధ్యతను పూర్తిగా, నమ్మకంగా కొనసాగించాలని మేము న్యూఢిల్లీని కోరుతున్నాం అంటూ పాక్ విదేశాంగ శాఖ కార్యాలయం ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఈ అంశంపై ఆర్బిట్రేషన్ కోర్టు తీర్పును తాము స్వాగతిస్తున్నామని పాక్ వెల్లడించింది. అయితే భారత్ మాత్రం పాక్ లేవనెత్తిన అభ్యంతరాల అంశంలో ఆర్బిట్రేషన్ కోర్టు కార్యకలాపాలను ఎన్నడు గుర్తించలేదు. మరి పాక్ ప్రధాని వ్యాఖ్యలపై భారత్ ఎలా స్పందిస్తూ చూడాలి అంటున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa