ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక రంగ అభివృద్ధి కోసం టీడీపీ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకు వస్తున్నాయి. సాగరతీరం విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని చెప్తున్న ఏపీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుస్తు వస్తున్న సంస్థలకు భూకేటాయింపులు, ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రానికి వస్తున్న ఐటీ సంస్థలలో మెజారిటీ కంపెనీలు.. విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పటికే టీసీఎస్, గూగుల్, కాగ్నిజెంట్ వంటి సంస్థలు విశాఖ కేంద్రంగా కార్యకలాపాలు సాగించేందుకు ఒప్పందాలు చేసుకోగా.. మరికొన్ని సంస్థలు కూడా అదే బాటలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో పలు కంపెనీలకు ప్రభుత్వం భూములు కేటాయిస్తోంది.
విశాఖపట్నంలో టీసీఎస్ క్యాంపస్ ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఐటీహిల్స్-3లో 22 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. విశాఖపట్నంలో టీసీఎస్ రూ.1370 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. దీని ద్వారా సుమారుగా 12 వేల మంది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇక కాగ్నిజెంట్ సంస్థ రూ.1583 కోట్లు పెట్టుబడి పెట్టనుండగా.. 8 వేల మందికి ఉద్యోగం, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అధికారులు చెప్తున్నారు. కాగ్నిజెంట్ సంస్థకు మధురవాడలో 22.19 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది.
మరోవైపు విశాఖపట్నంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్, క్లౌడ్ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు గూగుల్ ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో తర్లువాడలో గూగుల్ సంస్థకు 80 ఎకరాల భూమిని కేటాయించనున్నారు. ఇవే కాకుండా విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉర్సా, సిఫీ, ఫీనమ్ పీపుల్ వంటి సంస్థలు కూడా ముందుకు వచ్చాయి. మరోవైపు ఇప్పటికే 150 వరకూ సంస్థలు విశాఖ కేంద్రంగా పనిచేస్తున్నాయి. టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, మిరాకల్, డబ్ల్యూఎస్ఎస్ వంటి సంస్థలు ఇందులో ఉన్నాయి. సుమారుగా 30 వేల మంది వరకూ పనిచేస్తున్నారు. ఇప్పుడు కొత్త కంపెనీలు కూడా విశాఖ వైపు చూస్తున్న నేపథ్యంలో సాగర తీరం ఐటీ కేంద్రంగా మారనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు విశాఖపట్నం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో నాలుగు టౌన్షిప్లు ఏర్పాటు చేయాలని వీఎంఆర్డీఏ భావిస్తోంది. నాలుగు ప్రాంతాలలో థీమ్ బేస్డ్ టౌన్షిప్లు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. అలాగే విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టు ప్రక్రియ కూడా వేగవంతమైంది. ఆ రకంగా విశాఖలో మెరుగైన మౌలిక వసతుల కల్పన ద్వారా మరిన్ని కంపెనీలను ఆకర్షించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో.. మధురవాడ సహా విశాఖలో పలుచోట్ల భూముల ధరలు పెరుగుతున్నట్లు రియల్ ఎస్టేట్ వర్గాలు చెప్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa