ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సరిహద్దు వివాదాల మధ్య భారత్‌కు చైనా మంత్రి

international |  Suryaa Desk  | Published : Mon, Aug 18, 2025, 08:35 PM

భారత్-చైనా దేశాల మధ్య సరిహద్దు వివాదాలు ఎన్నో దశాబ్దాలుగా కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ఉద్రిక్తతలు రెండు దేశాల మధ్య సంబంధాలను నిరంతరం ప్రభావితం చేస్తుండగా.. వాటిని తగ్గించుకోవాలని ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత పర్యటనకు రావడం, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో భేటీ కావడం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. గాల్వన్ లోయ ఘర్షణల అనంతరం ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కానీ ఈ భేటీతో ఆ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని అంతా భావిస్తున్నారు.


సోమవారం రోజు సాయంత్రం చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారతదేశానికి రాబోతున్నారు. సాయంత్రం 4.15 గంటలకు ఆయన నేరుగా ఢిల్లీలో విమానం దిగబోతున్నారు. ఆ తర్వాత కాస్త ఫ్రెష్ అయి సాయంత్రం 6 గంటలకు భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్‌తో భేటీ కానున్నారు. అయితే వీరిద్దరి సమావేశానికి జైశంకర్ అధికారిక నివాసమే వేదిక కాబోతుంది. అలాగే ఈ భేటీలో ప్రధానంగా మూడు అంశాలు చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. అందులో ఒకటి సరిహద్దు వివాదాల పరిష్కారం, రెండోది వ్యాపార సంబంధాలు, మూడోది ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించి, సైనిక దళాలను పూర్తిగా ఉపసంహరించుకోవడం ఈ చర్చల్లో ప్రధాన ఎజెండా అని సమాచారం.


తూర్పు లడఖ్‌లోని సరిహద్దు ప్రాంతాల్లో చైనా సైనికుల మోహరింపులు, భారత సైనికుల కదలికలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఉద్రిక్త వాతావరణాన్ని చల్లార్చడం.. శాంతియుత వాతావరణాన్ని తిరిగి తీసుకురావడమే ఈ సమావేశం యొక్క ప్రధాన లక్ష్యం. అయితే గాల్వన్ లోయలో 2020లో జరిగిన ఘర్షణల తర్వాత ఇరు దేశాలు దౌత్య, సైనిక స్థాయిలో అనేక రౌండ్ల చర్చలు జరిపాయి. ఆ చర్చల వల్ల కొన్ని ప్రాంతాల నుంచి సైనికుల ఉపసంహరణ జరిగింది.


కానీ కొన్ని క్లిష్టమైన ప్రాంతాలలో ఇప్పటికీ సైనికుల మోహరింపు కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే వాంగ్ యీ, జైశంకర్ భేటీ ఈ సమస్యకు ఒక దౌత్యపరమైన పరిష్కారాన్ని కనుక్కుంటారని ఇరు దేశాలు అంచనా వేస్తున్నాయి. కేవలం సరిహద్దు సమస్య మాత్రమే కాకుండా భారత్-చైనా మధ్య ఉన్న వాణిజ్య లోటు కూడా ఈ చర్చల్లో ఒక ముఖ్య అంశంగా నిలవబోతుంది. అయితే సోమవారం రాత్రి వరకు ఈ సమావేశాన్ని ముగించుకుని.. ఆ తర్వాత రోజు అంటే మంగళవారం రోజు 11 గంటలకు వాంగ్ యూ.. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో సరిహద్దు సమస్యపై చర్చిస్తారు.


ఇక అదే రోజు సాయంత్రం 5.30 గంటలకు లోక్ కల్యాణ్ మార్గ్‌లోని ఆయన నివాసంలో ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తారని విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. షాంఘై సహకార సంస్థ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు మోదీ వెళ్లనున్న కొన్ని రోజుల ముందే జరగనున్నందున ఈ సమావేశం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఆగస్టు 29వ తేదీన జపాన్‌లో పర్యటించిన ప్రధాని మోదీ.. ఆపై SCO శిఖరాగ్ర సమావేశానికి ఉత్తర చైనా నగరమైన టియంజిన్‌కు వెళ్లనున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa