ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉద్యోగులను తొలగించినందుకు విమానయాన సంస్థకు కోర్టు భారీ షాక్

international |  Suryaa Desk  | Published : Mon, Aug 18, 2025, 08:32 PM

 ఈమధ్య కాలంలో అనేక ప్రైవేటు కంపెనీలు లేఆఫ్‌లు ఇస్తున్నాయి. ముందస్తు సమాచారం లేకుండానే వందల మందిని ఉద్యోగాల్లోంచి తొలగిస్తూ.. వారిని కష్టాల కడలిలోకి నెట్టేస్తున్నాయి. ముఖ్యంగా కరోనా సమయంలో అనేక సంస్థలు ఈ పని చేసి కష్ట కాలంలో ఉద్యోగులను వదిలించేసుకున్నాయి. ముఖ్యంగా ఓ విమానయాన సంస్థ.. 1800 మంది ఉద్యోగులకు ఒకేసారి లేఆఫ్లు ఇవ్వగా సదరు కుటుంబాలు రోడ్డున పడి తినేందుకు తిండి కూడా లేక నానా ఇబ్బందులు పడ్డాయి.


ఉద్యోగులు ఓవైపు ఇంట్లో వాళ్లను కాపాడుకుంటూనే.. మరోవైపు తమను అక్రమంగా ఉద్యోగాల్లోంచి తొలగించినందుకు సదరు సంస్థపై న్యాయ పోరాటానికి దిగారు. కోర్టును ఆశ్రయించి.. కొన్నేళ్లుగా పోరాటం సాగిస్తూనే వచ్చారు. ఎట్టకేలకు వారి బాధను గుర్తించిన కోర్టు సదరు సంస్థకు గట్టి షాక్ ఇచ్చింది. ముఖ్యంగా రూ.515 కోట్లకు పైగా జరిమానా విధించి సంచలన తీర్పును ఇచ్చింది. మరి ఇదెక్కడో మనం ఇప్పుడు తెలుసుకుందామా..?


2020లో ప్రపంచమంతా కరోనా సంక్షోభంలో ఉన్నప్పుడు.. క్వాంటాస్ విమానయాన సంస్థ 1800 మంది గ్రౌండ్ వర్కర్లను తమ ఉద్యోగాల నుంచి తొలగించింది. నష్టాలను తగ్గించుకోవడానికి ఇది అవసరమని కంపెనీ ఆ సమయంలో వాదించింది. అయితే ఉద్యోగుల యూనియన్, కార్మిక సంఘాలు దీనిని తీవ్రంగా వ్యతిరేకించాయి. వెంటనే న్యాయ పోరాటానికి దిగాయి. అయితే ఐదేళ్లుగా ఈ పోరాటం కొనసాగుతూనే వస్తుండగా.. క్వాంటాస్ యాజమాన్యం తమ ఉద్యోగులను అక్రమంగా తొలగించిందని, ఈ చర్య వెనుక అసలు ఉద్దేశం నష్టాలు తగ్గించుకోవడమో, లాభాలు పెంచుకోవడమో కాదని ఆస్ట్రేలియా ఫెడరల్ కోర్టు తేల్చి చెప్పింది.


ముఖ్యంగా కార్మికులు భవిష్యత్తులో సమ్మెలు, ఇతర కార్మిక ఆందోళనలు చేపట్టకుండా నిరోధించడమే ఈ తొలగింపుల వెనుక అసలు ఉద్దేశమని వ్యాఖ్యానించింది. అనవసరమైన కారణంతో 1800 కుటుంబాలను రోడ్డుకు ఈడ్చిందని నమ్ముతూ.. షాకింగ్ తీర్పును వెలువరించింది. ముఖ్యంగా క్వాంటాస్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూనే.. 59 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీ ప్రకారం రూ.515 కోట్లకు పైగా) జరిమానాను విధించింది. అక్కడితో ఆగకుండా కంపెనీ తన ఉద్యోగుల పట్ల ఉన్న చట్టబద్ధమైన బాధ్యతలను విస్మరించిందని.. ఈ చర్య తీవ్రమైన ఉల్లంఘన అని పేర్కొంది.


ఈ తరహా లేఆఫ్‌లు కార్మిక హక్కులకు విఘాతం కలిగించడమే కాకుండా కార్మిక సంబంధాల వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తాయని కోర్టు నొక్కి చెప్పింది. ఈ జరిమానా కేవలం ఒక శిక్ష మాత్రమే కాదని.. భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలకు పాల్పడకుండా ఇతర కంపెనీలకు ఒక గుణపాఠంగా ఉంటుందని కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa