ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్‌పై ఎక్కువ, చైనాపై తక్కువ సుంకాలు విధించడానికి కారణమిదే: మార్కో రూబియో

international |  Suryaa Desk  | Published : Mon, Aug 18, 2025, 08:31 PM

రష్యా చమురు విషయంలో అమెరికా అవలంబిస్తున్న వైఖరిపై ఆదేశ విదేశాంగ మంత్రి మార్క్ రూబియో సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌కు రష్యా నుంచి చమురు దిగుమతులపై పన్నులు, ఆంక్షలు విధిస్తూనే.. అదే పని చేస్తున్న చైనా విషయంలో మాత్రం అమెరికా ఎందుకు వెనుకడుగు వేస్తోందనే ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ముఖ్యంగా చైనా భారీ ఎత్తున రష్యా నుంచి ముడి చమురును కొనుగోలు చేసి, దాన్ని శుద్ధి చేసి.. ప్రపంచ మార్కెట్‌లోకి, ముఖ్యంగా ఐరోపా దేశాలకు తిరిగి అమ్ముతోందని రూబియో వివరించారు.


ప్రపంచ చమురు మార్కెట్‌పై ప్రభావం పడే అవకాశం..


ఈ ప్రక్రియ వల్ల అమెరికా చైనాపై ప్రత్యక్ష ఆంక్షలు విధించలేకపోతోందని ఆయన పరోక్షంగా ఒప్పుకున్నారు. ఒకవేళ చైనా శుద్ధి చేసే కంపెనీలపై ఆంక్షలు విధిస్తే.. అది ప్రపంచ చమురు మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని.. ధరలు విపరీతంగా పెరిగి, ఆర్థిక సంక్షోభానికి దారితీసే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ఈ కారణంగానే అమెరికా చైనాపై ఆంక్షల విషయంలో సంయమనం పాటిస్తోందని స్పష్టం చేశారు. అలాగే రష్యా.. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆపాలనే ఉద్దేశంతోనే భారత్‌పై ఎక్కువగా సుంకాలు విధిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు.


  రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం వల్ల భారత్‌పై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే 50 శాతం సుంకాలు విధించింది. దీనితో పాటు మరిన్ని ఆంక్షలు విధించే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది. ఈ నిర్ణయం భారత్-అమెరికా సంబంధాల్లో ఒక సమస్యగా మారిందని రూబియో అన్నారు. కానీ భారత్ ఒక కీలకమైన వ్యూహాత్మక భాగస్వామి అని, దానికి భారీగా ఇంధన అవసరాలు ఉన్నాయని కూడా ఆయన గుర్తించారు. రష్యా నుంచి చౌకగా చమురు లభించడం వల్లే భారత్ దానిని కొనుగోలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు.


ఈమధ్య కాలంలో అనేక దేశాలు ఈ విషయంపై స్పందిస్తున్నాయి. రష్యా నుంచి భారత్‌తో పాటు చైనా కూడా చమురు కొనుగోలు చేస్తోందని వివరిస్తున్నారు. కానీ కావాలనే అమెరికా భారత్‌పై ఎక్కువగా సుంకాలు విధిస్తూ.. చైనాను మాత్రం మినహాయిస్తున్నారని అంతర్జాతీయవ్యాప్తంగా ఆగ్రేహావేశాలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే మార్కో రూబియో ఈ కామెంట్లపై స్పందించారు. చైనాకు మినహాయింపు ఇవ్వడానికి, భారత్‌పై సుంకాలను పెంచడానికి కారణాలను క్షుణ్ణంగా వివరించారు. అయినప్పటికీ ఆయన మాటలు పట్టించుకోని కొందరు.. భారత్ పట్ల అమెరికా ద్వంద్వ నీతి ప్రదర్శిస్తోందని అంటున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa