ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్-పాకిస్థాన్ పరిస్థితిని నిత్యం గమనిస్తూనే ఉంటాం: మార్కో రూబియో

international |  Suryaa Desk  | Published : Mon, Aug 18, 2025, 08:38 PM

భారత్-పాకిస్థాన్‌ల మధ్య సంబంధాలు ఎప్పుడూ అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షిస్తూనే ఉంటాయి. ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ప్రపంచ శాంతికి సవాలుగా నిలుస్తుంటాయి. తాజాగా ఈ అంశంపై అమెరికాకు చెందిన ప్రముఖ సెనేటర్ మార్కో రూబియో చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. భారత్-పాకిస్థాన్‌ల మధ్య జరుగుతున్న పరిణామాలపై అమెరికా ప్రతిరోజూ ఒక కన్నేసి ఉంచుతుందని ఆయన స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో అలస్కాలో సమావేశం అయిన తర్వాత ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణ సవాళ్ల గురించి మాట్లాడుతూ.. రూబియో ఈ కామెంట్లు చేశారు.


రష్యా కాల్పుల విరమణకు అంగీకరించలేదు..


కాల్పుల విరమణలు చాలా త్వరగా విశ్చిన్నం అవుతాయని మార్కో రూబియో వెల్లడించారు. యుద్ధ విరమణకు ఏకైక మార్గం.. ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు కాల్పులు జరపడం ఆపడానికి అంగీకరించడం అని చెప్పారు. కానీ ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణకు రష్యా అంగీకరించలేదని అన్నారు. కాల్పుల విరమణలకంటే కూడా శాశ్వత పరిష్కారం దొరికితేనే సమస్య పూర్తిగా సమిసిపోతుందని తాను భావిస్తున్నట్లు చెప్పారు. ఇందుకు ఉదారహణగా.. భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని గుర్తు చేశారు. అయితే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ప్రతినిత్యం ఈ రెండు దేశాలపై అమెరికా ఓ కన్నేసి ఉంచుతుందని వెల్లడించారు.


కేవలం భారత్-పాకిస్థాన్ మాత్రమే కాకుండా కంబోడియా-థాయ్‌లాండ్ మధ్య కూడా ఏం జరుగుతుందో నిత్యం తాము గమనిస్తూనే ఉంటామన్నారు. ఉక్రెయిన్‌లో మూడున్నర సంవత్సరాలుగా యుద్ధం జరుగుతోందని.. కాల్పుల విరమణ చాలా త్వరగా విశ్ఛిన్నం అవుతోందని చెప్పారు. అందుకే శాశ్వత కాల్పుల విరమణ చేయిస్తే.. ఎప్పటికీ ఏ దేశం మధ్య యుద్ధం రాదని పేర్కొన్నారు. అదే తమ ఉద్దేశ్యమని కూడా స్పష్టం చేశారు.


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో భారత్-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంలో తాను సహాయం చేశానని పేర్కొన్నారు. అయితే భారత్ మాత్రం ఈ వాదనలను ఎప్పటి నుంచో ఖండిస్తూనే ఉంది. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ద్వైపాక్షికంగా కుదిరిందని.. దీనిలో మూడో పక్షం జోక్యం లేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఇరు దేశాల పరిస్థితిపై నిరంతరం నిఘా ఉంచుతున్నామని చెప్పడం గమనార్హంగా నిలిచింది. మరి రూబియో కామెంట్లపై భారత్ ఎలా స్పందిస్తుందో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa