ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎల్‌టీటీఈ ప్రభాకరన్ అమ్మ లాంటివాడు.. విజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు

national |  Suryaa Desk  | Published : Sat, Sep 20, 2025, 11:16 PM

అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమిళగ వెట్రి కళగం పార్టీని పెట్టిన సినీ హీరో దళపతి విజయ్.. తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నారు. వరుసగా బహిరంగ సభలు, కార్యక్రమాలు చేపడుతూ.. వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అధికార డీఎంకే పార్టీని ఢీకొట్టేది తానే అనే సంకేతాలు దేశవ్యాప్తంగా పంపిస్తున్నారు. ఇక కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంతోపాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ సందర్భంగా తాజాగా విజయ్ చేసిన వ్యాఖ్యలు.. తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. వేలుపిళ్లై ప్రభాకరన్‌ అలియాస్ ఎల్‌టీటీఈ ప్రభాకరన్‌పై విజయ్ ప్రశంసలు కురిపించడం గమనార్హం.


నాగపట్టణంలో నిర్వహించిన ఓ ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ప్రసగించిన విజయ్.. శ్రీలంక తమిళులకు ప్రభాకరన్ అమ్మలాంటివాడు అని వ్యాఖ్యానించారు. మన తోడబుట్టిన బంధువులైన ఈళం తమిళులు.. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా.. వారికి తల్లి ప్రేమను చూపించిన నాయకుడిని కోల్పోయి వారు బాధపడుతున్నారని పేర్కొన్నారు. వారి కోసం గొంతు ఎత్తాల్సిన బాధ్యత మనపై ఉందని విజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా విమర్శలకు కారణం అవుతున్నాయి. భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్యకు కుట్ర చేసిన ఎల్‌టీటీఈ ప్రభాకరన్‌ను విజయ్ ఇప్పుడు ప్రశంసించడం తమిళనాట సంచలనంగా మారింది.


అయితే శ్రీలంక తమిళులకు అనుకూలంగా విజయ్ గళం ఎత్తడం ఇదే తొలిసారి కాదు. 2008లో శ్రీలంకలో తమిళుల హత్యకు నిరసనగా చెన్నైలో నిర్వహించిన నిరాహార దీక్షలో విజయ్ పాల్గొన్నారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల వేళ.. తమిళనాడు రాజకీయాల్లో శ్రీలంక తమిళుల అంశం ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటుంది. అదే కాకుండా మరీ ముఖ్యంగా నాగపట్టణం మత్స్యకారులకు ఇది చాలా ఎమోషనల్ అంశం. మత్స్యకారుల సమస్యల గురించి లేఖ రాసి.. ఆ తర్వాత మౌనంగా ఉండే డీఎంకే ప్రభుత్వం లాంటి వాళ్లం తాము కాదని.. వారి సమస్య పరిష్కరించడం తమ కీలక అజెండాల్లో ఒకటని ఈ సందర్భంగా విజయ్ స్పష్టం చేశారు. తమిళ జాలర్లపై శ్రీలంక నేవీ దాడులకు గల కారణాలు, పరిష్కారాలపై తాను మదురై సమావేశంలో మాట్లాడానని.. వారికి అండగా ఉండటం మన కర్తవ్యమని పేర్కొన్నారు.


అయితే తమిళనాడులో ఎల్‌టీటీఈ ప్రభాకరన్‌కు ఫ్యాన్స్ ఉండటం గమనార్హం. గతంలో కూడా దివంగత మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం. కరుణానిధి సహా పలువురు తమిళనాడు రాజకీయ నాయకులు కూడా ప్రభాకరన్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హార్డ్‌లైనర్ తమిళుల మధ్య ప్రభాకరన్ ఇప్పటికీ ఒక వీరుడిగానే కనిపిస్తారు. ఎన్నికలకు ముందు విజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఏ విధంగా ప్రభావం చూపుతాయో వచ్చే ఏడాది వరకు వేచి చూడాలి.


1991 మే 21వ తేదీన మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీని.. చెన్నైకి సమీపంలోని శ్రీ పెరంబుదూరు వద్ద ఎల్‌టీటీఈ టీమ్ మానవ బాంబుతో హత్య చేసిన సంగతి తెలిసిందే. అయితే రాజీవ్‌గాంధీ హత్యకు కుట్రచేసి, అమలు చేసిన ఎల్‌టీటీఈ ప్రభాకరన్‌ను విజయ్‌ ప్రశంసించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 1987లో శ్రీలంకలో భారత శాంతి భద్రత దళాలను.. పంపినందుకు ప్రతీకారంగానే రాజీవ్ గాంధీని ఎల్‌టీటీఈ హత్య చేసిందనే వాదనలు ఉన్నాయి. ఇక రాజీవ్ గాంధీ హత్య తర్వాత భారత్ ఎల్‌టీటీఈపై నిషేధం విధించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa