కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై బీజేపీ అధికార ప్రతినిధి అజయ్ అలోక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ 90కి పైగా ఎన్నికల్లో ఓడిపోయిందని, ఇది ఒక ప్రపంచ రికార్డు అని ఆయన ఎద్దేవా చేశారు. భారత్లో రాహుల్ను ఎవరూ పట్టించుకోవడం లేదని, ఆయన పాకిస్థాన్ పౌరసత్వం తీసుకుంటే మంచిదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.ఆదివారం ఓ జాతీయ వార్తా సంస్థతో మాట్లాడుతూ అజయ్ అలోక్ ఈ వ్యాఖ్యలు చేశారు. "రాహుల్ గాంధీ ఇప్పటికే ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు. ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ 90కి పైగా ఎన్నికల్లో ఓడిపోయింది. భారతదేశంలో ప్రజలు ఆయన్ను సీరియస్గా తీసుకోవడం మానేశారు. అందుకే నాదొక సలహా, ఆయన పాకిస్థాన్ పౌరసత్వం తీసుకోవాలి. అక్కడ ఆయనకు మంచి ఆదరణ ఉంది. చివరికి షాహిద్ అఫ్రిదీ కూడా ఆయన్ను పొగుడుతున్నాడు. ఇక భారత్లో ఆయనతో పనేముంది" అని అలోక్ ప్రశ్నించారు.బీహార్లో తేజస్వి యాదవ్ చేపట్టిన యాత్రపైనా అజయ్ అలోక్ స్పందించారు. అది కేవలం తన రాజకీయ మనుగడ కోసం చేస్తున్న పోరాటమని విమర్శించారు. "మొదట కాంగ్రెస్ను కాపాడటానికి రాహుల్ గాంధీ యాత్ర చేశారు. ఇప్పుడు తేజస్వి కూడా యాత్ర మొదలుపెట్టారు. కానీ చివరికి అది జైలు యాత్రతోనే ముగుస్తుంది" అని ఆయన జోస్యం చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa