ఎలమంచిలి పట్టణంలో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3.30 గంటల వరకు ఈదురు గాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఎక్కడికక్కడే విద్యుత్ తీగలపై చెట్ల కొమ్మలు పడ్డాయి. గంటన్నర పాటు ఏకధాటిగా వర్షం కురవడంతో 50 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జనజీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రధానంగా లైను కొత్తూరు ప్రధాన రోడ్డు, పెదపల్లి జంక్షన్ సమీపంలో హైవేపై చెట్లు పడిపోవడంతో కొద్ది సేపు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. పట్టణంలో పలు ప్రధాన రోడ్లు జలమయమయ్యాయి. ప్రధాన రోడ్డు, కొత్తపేట, ఎల్ఐసీ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయం రోడ్డు, క్లబ్ రోడ్లపై వర్షపు నీరు ప్రవహించింది. పోస్టాఫీసు వీధిలో విద్యుత్ తీగలపై చెట్లు పడిపోవడంతో తీగలు తెగిపోయాయి. దీంతో అంధకారం నెలకొంది. కొక్కిరాపల్లి సమీపంలో పిడుగుపాటుకు గేదె మృతి చెందింది. విద్యుత్, మునిసిపల్, అగ్నిమాపక, రెవెన్యూ, శానిటరీ, పోలీసు శాఖల అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. ఈ వర్ష బీభత్సానికి సుమారు 20కిపైగా విద్యుత్ స్తంభాలు నేలకొరిగి ఉండవచ్చని విద్యుత్ శాఖ ఏఈ తెలిపారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు జోరుగా సాగుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa