గుంటూరు జిల్లాను ఓ వైపు డయేరియా, మరోవైపు కలరా భయపెడుతున్నాయి. గుంటూరు జిల్లాలో కలరా కేసులు బయటపడటం కలకలం రేపుతోంది. గుంటూరు జిల్లాలో ఇప్పటి వరకూ మూడు కలరా కేసులు వెలుగు చూసినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య పనులను పరిశీలిస్తున్నారు. అలాగే కలరా కేసులు వెలుగు చూసిన ప్రాంతాల్లో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలోని అంగలకుదురులో ఉండే ఓ మహిళకు కలరా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఈమెకు తాడేపల్లి మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ మహిళ హైదరాబాద్ నుంచి వచ్చినట్లు స్థానిక అధికారులు చెప్తున్నారు. ఈ కేసు వెలుగు చూడటంతో వైద్యారోగ్య శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. ఇంటింటి సర్వే నిర్వహించారు. వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేశారు.
మరోవైపు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మంగళవారం గుంటూరులో పర్యటించారు. తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య పనులను ఎమ్మెల్యే, కలెక్టర్ పర్యవేక్షించారు. కలరా కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కాచి చల్లార్చిన నీరు తాగాలని సూచించారు. మరోవైపు ఓల్డ్ గుంటూరులో తొమ్మిది హైరిస్క్ ప్రాంతాలను గుర్తించినట్లు గుంటూరు జిల్లా కలెక్టర్ తెలిపారు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రస్తుతం 92 యాక్టివ్ డయేరియా కేసులు ఉన్నాయని వివరించారు. గుంటూరులో రాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ఏర్పాటు చేశామని.. 50 ప్రత్యేక వైద్య ఇంటింటి సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు.
జిల్లాస్థాయి అధికారి నేతృత్వంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్న కలెక్టర్.. ఈ బృందాలు కలరా, డయేరియా వ్యాప్తిని నిరోధించేందుకు కృషి చేస్తాయని వివరించారు. కలరా, డయేరియా కేసుల నేపథ్యంలో గుంటూరు నగరంలో పానీపూరి బండ్లను పూర్తిగా మూసివేయించినట్లు కలెక్టర్ వెల్లడించారు. రాంరెడ్డి తోట, ప్రగతినగరం వంటి ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని వెల్లడించారు. అనవసర ఆందోళనలు వద్దని.. ఏవైనా సందేహాలు ఉంటే ప్రభుత్వ వైద్యులను, అధికారులను సంప్రదించాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa