ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రధాని మోదీ స్వదేశీ పిలుపు.. 'జోహో'కి మారిపోతున్నా, కేంద్రమంత్రి

national |  Suryaa Desk  | Published : Tue, Sep 23, 2025, 08:38 PM

ఇటీవల గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) తగ్గింపు, శ్లాబుల తొలగింపు అమల్లోకి వచ్చిన తర్వాత దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. భారతీయులంతా స్వదేశీ వస్తువులు , సేవలనే ఉపయోగించాలని కీలక పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఒకవైపు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై సుంకాల మోత మోగిస్తుండటంతో పాటు అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో.. భారతీయులు స్వదేశీ వస్తువులను కొనుగోలు చేసి.. ఇక్కడి వ్యాపారులు, రైతులు, ఉత్పత్తిదారులకు అండగా నిలవాలని పేర్కొన్నారు. ఇక ప్రధాని మోదీ ఇచ్చిన స్వదేశీ పిలుపుతో.. కేంద్ర రైల్వే, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ .. ఆ దిశగా తొలి అడుగు వేశారు.


స్వదేశీ టెక్నాలజీని ప్రోత్సహించేందుకు, డిజిటల్ ఇండియాలో భాగంగా అశ్వినీ వైష్ణవ్.. తన అధికారిక పనులకు ఇక నుంచి విదేశీ సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగించకుండా స్వదేశీ టెక్నాలజీతో రూపొందించిన జోహో ప్లాట్‌ఫామ్ ‌ను ఉపయోగించనున్నట్లు తాజాగా ప్రకటించారు. ఇదే విషయాన్ని ఆయన స్వయంగా తన ఎక్స్ అకౌంట్‌లో వీడియోతో సహా వెల్లడించారు. తాను జోహోకి మారుతున్నానని పేర్కొన్నారు. డాక్యుమెంట్లు, స్ప్రెడ్‌ షీట్లు, ప్రజెంటేషన్ల కోసం జోహో అనేది మన స్వదేశీ ప్లాట్‌ఫామ్ అని ఆయన తన పోస్ట్‌లో వెల్లడించారు. విదేశీ సాఫ్ట్‌వేర్ సంస్థలకు ఏ మాత్రం తీసిపోని విధంగా భారతీయ కంపెనీలు రూపొందించిన ఈ జోహో ప్లాట్‌ఫామ్.. టెక్నాలజీని ప్రోత్సహించడంలో ఇది ఒక కీలక అడుగుగా భావిస్తున్నారు.


  జోహో ప్లాట్‌ఫామ్ ప్రత్యేకతలు


జోహో అనేది తమిళనాడు రాజధాని చెన్నైకి చెందిన ఒక ప్రముఖ టెక్నాలజీ సంస్థ. ఈ జోహో ప్లాట్‌ఫామ్‌లో డాక్యుమెంట్లు, స్ప్రెడ్‌ షీట్లు, ప్రజెంటేషన్లు వంటి ఆఫీస్ అప్లికేషన్స్‌తో పాటు అనేక బిజినెస్ మెయింటెనెన్స్ సాఫ్ట్‌వేర్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ జోహో సేవలను.. ప్రపంచవ్యాప్తంగా సుమారు 180కి పైగా దేశాల్లో లక్షలాది మంది యూజర్లు ఉపయోగిస్తున్నారు. మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి ఇంటర్నేషనల్ కంపెనీలకు ఈ జోహో గట్టి పోటీని ఇస్తోందని టెక్ నిపుణులు చెబుతున్నారు. జోహో మరో స్పెషాలిటీ ఏంటంటే.. ఈ ప్లాట్‌ఫామ్‌లో ఉన్న యూజర్ల డేటాను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో యాడ్స్ కోసం యూజర్ల డేటాను విక్రయించకుండా యూజర్ల గోప్యతకు అధిక ప్రాధాన్యం ఇస్తుంటుంది.


ప్రస్తుతం దేశవ్యాప్తంగా నవరాత్రోత్సవాలు, దసరా పండుగ సీజన్‌ ప్రారంభం కాగా.. దేశీయంగా తయారైన స్వదేశీ వస్తువులను మాత్రమే కొనుగోలు చేయాలని దేశ ప్రజలకు ప్రధాని మోదీ లేఖ రాసిన తర్వాత కేంద్రమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయడం అనేది.. వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని సాధించడానికి దోహదపడుతుందని నరేంద్ర మోదీ వెల్లడించారు. ప్రజలు స్వదేశీ వస్తువులు కొనుగోలు చేయడం వల్ల.. భారత దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడమే కాకుండా స్థానిక చేతివృత్తులు కార్మికులు, పరిశ్రమలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.


అశ్వినీ వైష్ణవ్ చేసిన పోస్ట్‌కు జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబు స్పందించారు. కేంద్రమంత్రి తీసుకున్న తీసుకున్న నిర్ణయం తమ టీమ్‌కు స్ఫూర్తిగా నిలుస్తుందని, కంపెనీ దీర్ఘకాలిక ప్రయత్నాలను మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా అశ్వినీ వైష్ణవ్‌కు శ్రీధర్ వెంబు ధన్యవాదాలు తెలిపారు. 2 దశాబ్దాలకు పైగా కష్టపడి తమ ఇంజనీర్లు కష్టపడి ఈ జోహో ప్లాట్‌ఫామ్‌ను డెవలప్ చేయగా.. వారికి ఇది గొప్ప ధైర్యాన్ని ఇస్తుందని.. తాము దేశాన్ని గర్వపడేలా చేస్తామని వెల్లడించారు. జై హింద్ అంటూ శ్రీధర్ వెంబు ఎక్స్‌లో రాసుకొచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa