ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'అమెరికాకు భారత్ అత్యంత ముఖ్యమైన భాగస్వామి': మార్కో రూబియో

international |  Suryaa Desk  | Published : Tue, Sep 23, 2025, 09:27 PM

ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ 80వ సెషన్‌లో పాల్గొనేందుకు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అమెరికా వెళ్లిన విషయం అందరికీ తెలిసిందే. అయితే సోమవారం రోజే ఆయన అక్కడకు చేరుకోగా.. న్యూయార్క్‌లో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో ముఖ్యమైన సమావేశం నిర్వహించారు. ఈ భేటీలోనే ఇరు దేశాల మధ్య వాణిజ్యం, రక్షణ, ఇంధనం, ఔషధాలు, కీలకమైన ఖనిజాలు వంటి కీలక రంగాలలో వ్యూహాత్మక సహకారాన్ని బలోపేతం చేయడంపై ఇరువురు నేతలు చర్చించారు. ఈ భేటీ అనంతరమే మార్కో రూబియో మాట్లాడుతూ.. భారత్‌తో సంబంధాలు అమెరికాకు అత్యంత కీలకమని అన్నారు.


ముఖ్యంగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. అందులో భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్‌తో సమావేశం అయ్యానని పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ భేటీలో ఇరు దేశాల మధ్య వాణిజ్యం, రక్షణ, ఇంధనం, ఔషధాలు, కీలకమైన ఖనిజాలు వంటి కీలక విషయాల్లో భాగస్వామ్యం గురించి చర్చించామన్నారు. భారత్‌తో సంబంధాలు అమెరికాకు కీలకమని రూబియో స్పష్టం చేశారు. అలాగే అమెరికా విదేశాంగ శాఖ కూడా ఒక అధికారిక ప్రకటనను విడుదల చేస్తూ.. వాషింగ్టన్‌కు భారతదేశం “అత్యంత ముఖ్యమైనది” అని పునరుద్ఘాటించింది.


అలాగే “భారతదేశం అమెరికాకు అత్యంత ముఖ్యమైన భాగస్వామి. వాణిజ్యం, రక్షణ, ఇంధనం, ఔషధాలు, కీలక ఖనిజాలు మరియు ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన ఇతర అంశాలపై భారత ప్రభుత్వం నిరంతరంగా చూపుతున్న సహకారాన్ని కార్యదర్శి రూబియో ప్రశంసించారు” అని అమెరికా విదేశాంగ శాఖ ఆ ప్రకటనలో పేర్కొంది. మరోవైపు భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా ఈ సమావేశంపై తన అభిప్రాయాన్ని ఎక్స్ వేదికగా పంచుకున్నారు.


“ఈరోజు ఉదయం న్యూయార్క్‌లో విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోను కలవడం ఆనందంగా ఉంది. మా సంభాషణలో ప్రస్తుత ద్వైపాక్షిక, అంతర్జాతీయ సమస్యలు చర్చకు వచ్చాయి. ప్రాధాన్యతగల రంగాలలో పురోగతి సాధించడానికి నిరంతర సహకారం అవసరమని మేం అంగీకరించాము. మేం ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాము” అని ఆయన తన పోస్టులో తెలిపారు.


రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుండడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో భారత దిగుమతులపై పెద్ద ఎత్తున సుంకాలు విధించారు. ఈ సుంకాల విధింపు నేపథ్యంలో ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం వాణిజ్య ఒప్పందం కోసం ఇరుదేశాల ప్రతినిధులు చర్చలు జరుగుతున్నాయి. ఈక్రమంలోనే జైశంకర్, రూబియోలు సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa