ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జీఎస్టీ ప్రయోజనాలు ప్రజలకు అందేలా కేంద్రం చర్యలు

national |  Suryaa Desk  | Published : Wed, Sep 24, 2025, 08:15 AM

జీఎస్టీ సంస్కరణల తర్వాత తగ్గిన ధరల ప్రయోజనాలు సామాన్య ప్రజలకు అందుతున్నాయో లేదో నిర్ధారించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. జీఎస్టీ కారణంగా తగ్గిన ధరలకు అనుగుణంగా వ్యాపారులు వస్తువులను విక్రయించని పక్షంలో, వినియోగదారులు నేరుగా ఫిర్యాదు చేసేందుకు వీలుగా ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్  మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది.వినియోగదారులు తమ ఫిర్యాదులను నమోదు చేయడానికి 1915 అనే టోల్ ఫ్రీ నెంబర్‌ను, 88000 01915 అనే వాట్సాప్ నెంబర్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. ఎవరైనా వ్యాపారులు జీఎస్టీ ప్రయోజనాలను బదిలీ చేయకుండా అధిక ధరలకు వస్తువులను విక్రయిస్తే, ఈ నెంబర్లకు ఫోన్ చేసి గానీ, వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపి గానీ ఫిర్యాదు చేయవచ్చని అధికారులు సూచించారు. వీటితో పాటు, ప్రభుత్వానికి చెందిన ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ రీడ్రెసల్ మెకానిజం  పోర్టల్ ద్వారా కూడా తమ సమస్యలను తెలియజేయవచ్చు.మరోవైపు, ప్రజలు ఎక్కువగా ఉపయోగించే 54 రకాల ఉత్పత్తుల ధరల మార్పులపై కేంద్రం ప్రత్యేకంగా దృష్టి సారించింది. వెన్న, షాంపూ, టూత్‌పేస్ట్, ఐస్‌క్రీమ్, ఏసీ, టీవీ, సిమెంట్‌తో పాటు గ్లూకోమీటర్ వంటి కీలక వస్తువుల ధరలను నిశితంగా పరిశీలించాలని నిర్ణయించింది. ఈ ఉత్పత్తుల ధరల్లో వస్తున్న మార్పులపై ప్రతి నెలా తమకు నివేదిక సమర్పించాలని ఈ నెల 9వ తేదీన కేంద్ర ఆర్థిక శాఖ జీఎస్టీ అధికారులను ఆదేశించింది. ఈ క్రమంలో, తొలి నివేదికను సెప్టెంబర్ 30వ తేదీలోగా అందజేయాల్సి ఉంటుంది. ఈ-కామర్స్ సంస్థలు కూడా తగ్గిన ధరలకే వస్తువులను అందిస్తున్నాయా లేదా అనే అంశాన్ని కూడా ప్రభుత్వం పర్యవేక్షిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa