ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చేనేతలకు అండగా నిలబడ్డాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 24, 2025, 08:00 PM

అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్‌ అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేశ్‌ సమాధానమిచ్చారు. చేనేత వృత్తిని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, దాదాపు 50 నియోజకవర్గాల్లో చేనేతలు ఉన్నారని గుర్తుచేశారు. గతంలో చేనేత సొసైటీలకు ఆర్డర్లు ఇచ్చినప్పుడు సరఫరాలో జాప్యం జరిగిందని, ప్రభుత్వ టెండర్లలో మార్కెట్ ధరలతో పోటీ పడటం వంటి సవాళ్లు ఉన్నాయని అన్నారు. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనేందుకే నలుగురైదుగురు సభ్యులతో కమిటీ వేస్తున్నామని, అందరితో చర్చించి ఒక పటిష్ఠ‌మైన విధానాన్ని రూపొందిస్తామని వివరించారు.ప్రస్తుత ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టెండర్ల విధానంలో పారదర్శకత తీసుకొచ్చామని లోకేశ్ పేర్కొన్నారు. దీని ద్వారా గత ఏడాది విద్యార్థులకు అందించే కిట్లు, గుడ్లు, చిక్కీల కొనుగోళ్లలో రూ. 200 కోట్లు ఆదా చేశామని తెలిపారు. ఇదే విధానాన్ని కొనసాగించి, ఐదేళ్లలో విద్యాశాఖలో రూ. 1000 కోట్లు ఆదా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఈ ఏడాది విద్యార్థులకు అత్యుత్తమ నాణ్యతతో, మన్నికైన వస్త్రంతో కొత్త యూనిఫాంలు అందించామని మంత్రి తెలిపారు.పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు చేనేతలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందిస్తూ తమ ప్రభుత్వం మాట నిలబెట్టుకుందని లోకేశ్‌ గుర్తుచేశారు. మంగళగిరిలో 'వీవర్స్ శాల' ద్వారా చేనేతల ఆదాయాన్ని 40 నుంచి 50 శాతం పెంచేందుకు నిర్మాణాత్మక కృషి చేస్తున్నామని, మార్కెటింగ్ కోసం టాటా టనేరా వంటి సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నామని ఆయన సభకు వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa