ఏపీలోని మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని మహిళలకు స్త్రీ శక్తి పథకం పేరుతో ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్ట్ 15వ తేదీ సాయంత్రం విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభించారు. నాటి నుంచి ఉచిత బస్సు పథకం కింద మహిళలు రాష్ట్రవ్యాప్తంగా ఐదు రకాల బస్సులలో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. పల్లెవెలుగు. అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులలో స్త్రీ శక్తి పథకం అమలు చేస్తున్నారు. మొదట ఘాట్ రోడ్లలో అనుమతించనప్పటికీ.. ప్రస్తుతం ఘాట్ రోడ్లలోనూ ఉచిత బస్సు పథకం అమలవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన గుర్తింపు కార్డులు చూపించి బస్సులలో ఉచితంగా ప్రయాణించే వీలుంది.
అయితే ప్రస్తుతం అన్ని రకాల పథకాలకు ఆధార్ కార్డు తప్పనిసరి కావటంతో.. ఉచిత బస్సు పథకానికి కూడా ఆధార్ కార్డు ప్రామాణికంగా మారింది. ఆధార్ కార్డు చూపించి మహిళలు స్త్రీ శక్తి పథకం లబ్ధి పొందుతున్నారు. ఆధార్ కార్డు చూపించిన మహిళలు. బాలికలకు ఆర్టీసీ సిబ్పంది జీరో ఫేర్ టికెట్లు జారీ చేస్తున్నారు. ఈ జీరో ఫేర్ టికెట్ల మీద ప్రయాణించిన దూరంతో పాటుగా ప్రభుత్వం కల్పించిన ఉచిత సదుపాయం ద్వారా ఆ మహిళలకు ఎంతమేరకు లబ్ధి చేకూరిందనే వివరాలు కూడా ముద్రిస్తున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం ఉచిత బస్సు పథకం అమలులో మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ఉచిత బస్సు పథకం అమలు కోసం ఇప్పటి వరకూ మహిళలు తమ ఆధార్ కార్డులను బస్సు కండక్టర్లకు చూపించాల్సి ఉండేది. అయితే ఇప్పుడు తాజాగా ఇందులో మరో సదుపాయం కల్పించారు. ఉచిత బస్సు పథకం కోసం ఒరిజినల్ ఆధార్ కార్డు చూపించాలనే నిబంధనల్లో చిన్న మార్పులు చేశారు. మొబైల్ ఫోన్లలో ఆధార్ కార్డు చూపించినా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు. డిజిలాకర్ ద్వారా ఆధార్ కార్డు చూపించిన వారికి కూడా ఫ్రీ బస్ జర్నీ సదుపాయం కల్పిస్తారు. ఈ మేరకు అన్ని ఆర్టీసీ డిపో మేనేజర్లకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
మరోవైపు ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సులలో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగింది. ఆక్యుపెన్సీ పెరగటంతో పాటుగా పురుషుల కంటే మహిళా ప్రయాణికులు ఎక్కువైనట్లు అధికారులు చెప్తున్నారు. అలాగే సీట్ల కోసం అక్కడక్కడా గొడవలు కూడా జరుగుతున్నాయి. అయితే స్త్రీ శక్తి పథకం విజయవంతంగా అమలు అవుతోందని ప్రభుత్వం వెల్లడించింది. తాజాగా మహిళల సౌలభ్యం కోసం ఈ నిర్ణయం తీసుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa