బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహ్మద్ యూనస్, భారత్తో తమ దేశ సంబంధాలు ప్రస్తుతం సమస్యాత్మకంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా న్యూయార్క్లో ఆయన మాట్లాడుతూ, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయని అంగీకరించారు. గతేడాది బంగ్లాదేశ్లో విద్యార్థులు చేపట్టిన భారీ నిరసనను, ఆ తర్వాత షేక్ హసీనా అధికారం కోల్పోవడాన్ని భారత్ ఇష్టపడలేదని ఆయన అభిప్రాయపడ్డారు."విద్యార్థులు చేసింది వారికి (భారత్కు) నచ్చకపోవచ్చు. ప్రస్తుతం భారత్తో మాకు సమస్యలు ఉన్నాయి" అని యూనస్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా భారత మీడియాపై కూడా ఆయన ఆరోపణలు చేశారు. బంగ్లాదేశ్లో జరిగిన పరిణామాలను ఒక ‘ఇస్లామిక్ ఉద్యమం’గా చిత్రీకరిస్తూ, భారతదేశం నుంచి అనేక నకిలీ వార్తలు వస్తున్నాయని, ఇవి పరిస్థితిని మరింత దిగజార్చాయని ఆయన అన్నారు. మాజీ ప్రధాని షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం కల్పించడం కూడా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు కారణమవుతోందని ఆయన పేర్కొన్నారు.అమెరికా ప్రత్యేక రాయబారి సెర్గియో గోర్తో జరిగిన సమావేశంలో యూనస్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా, నిలిచిపోయిన సార్క్ కూటమిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని అన్నారు. మరోవైపు, తమ తాత్కాలిక ప్రభుత్వం ఆధ్వర్యంలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బంగ్లాదేశ్లో స్వేచ్ఛగా, శాంతియుతంగా సార్వత్రిక ఎన్నికలు నిర్వహిస్తామని యూనస్ హామీ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa