ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైరల్ జ్వరంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. గత నాలుగు రోజులుగా పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. అయితే నాలుగు రోజులు అయినా కూడా పవన్ కళ్యాణ్కు జ్వరం తీవ్రత తగ్గలేదు. దగ్గు ఎక్కువగా ఉండటంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో వైద్యుల సూచన మేరకు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వెళ్లనున్నారు. శుక్రవారం రోజున మంగళగిరి నుంచి హైదరాబాద్ వెళ్లనున్న పవన్ కళ్యాణ్.. హైదరాబాద్లో వైద్య పరీక్షలు చేయించుకుంటారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ఆదివారం హైదరాబాద్లో జరిగిన ఓజీ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్లో పాల్గొన్నారు పవన్ కళ్యాణ్. వర్షంలో తడుస్తూనే ఆ వేడుకల్లో పాల్గొన్నారు. అభిమానులను నిరాశకు గురిచేయకూడదనే ఉద్దేశంతో వర్షంలోనూ ఓజీ ఈవెంట్లో పాల్గొని ప్రసంగించారు.
అయితే సోమవారం ఆయనకు వైరల్ ఫీవర్ సోకినట్లు తెలిసింది. వైరల్ జ్వరంతో బాధపడుతున్నప్పటికీ సోమవారం పవన్ కళ్యాణ్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. అనంతరం ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు. అయితే సోమవారం రాత్రి నుంచి పవన్ కళ్యాణ్కు జ్వర తీవ్రత పెరిగినట్లు జనసేన పార్టీ వర్గాలు వెల్లడించాయి. దీంతో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు వెల్లడించాయి. అయితే జ్వరంతో బాధపడుతూ కూడా పవన్ కళ్యాణ్ శాఖాపరమైన అంశాలపై అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారని పేర్కొన్నాయి. పవన్ కళ్యాణ్కు వైరల్ ఫీవర్ సోకి నాలుగు రోజులు గడుస్తున్నా తీవ్రత తగ్గకపోవటం, దగ్గు ఎక్కువగా వస్తూ ఉండటంతో వైద్యులు హైదరాబాద్కు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించినట్లు తెలిసింది.
మరోవైపు పవన్ కళ్యాణ్కు వైరల్ ఫీవర్ తగ్గలేదని తెలిసీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. పవన్ కళ్యాణ్ వేగంగా కోలుకోవాలని ఆకాంక్షించారు. "గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా, త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేయడం కొనసాగించేందుకు, ఓజీ సినిమా విజయాన్ని ఆస్వాదించడానికి పవన్ కళ్యాణ్ మంచి ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటున్నాను." అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
మరోవైపు ఏపీ ఎన్నికల సమయంలోనూ పవన్ కళ్యాణ్ అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే, వైరల్ ఫీవర్ సోకటంతో అప్పట్లోనూ పవన్ కళ్యాణ్ ఇబ్బందులు పడ్డారు. ఇక పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని.. ఓజీ మూవీ విజయాన్ని ఎంజాయ్ చేయాలని పవన్ కళ్యాణ్ అభిమానులు కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa