ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐపీఎల్ 2026.. డిసెంబర్‌లోనే మినీ వేలం

sports |  Suryaa Desk  | Published : Fri, Oct 10, 2025, 09:56 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్.. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు దీనిపై ఎంతో ఆసక్తి ఉంటుంది. ఆ సమయంలో సాధారణంగా ఇతర అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు కూడా పెద్దగా జరగవని చెప్పొచ్చు. అన్ని దేశాల క్రికెటర్లు వచ్చి ఐపీఎల్ ఆడేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పటివరకు 18 సీజన్లు ముగిసిన సంగతి తెలిసిందే. చివరిసారిగా 18వ సీజన్‌ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. ఇప్పుడు.. 19వ సీజన్ కోసం క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్ మ్యాచ్‌లకు ఎంత క్రేజ్ ఉంటుందో.. ఇక్కడ వేలానికి కూడా అంతే క్రేజ్ ఉంటుందని చెప్పొచ్చు. ఇక గతేడాది మెగా ఆక్షన్ జరగ్గా.. ఈసారి 19వ సీజన్‌కు ముందు మినీ వేలం నిర్వహించనున్నారు.


ఇప్పుడు దీనికి సంబంధించి ఒక అప్డేట్ వచ్చినట్లు తెలుస్తోంది. మినీ వేలం ఈ ఏడాది డిసెంబర్ 13-15 తేదీల్లో జరగనున్నట్లు ఆంగ్ల మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే బీసీసీఐ.. ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు ప్రాథమిక సమాచారం కూడా అందించినట్లు తెలిసింది. మరోవైపు.. ఫ్రాంఛైజీలకు రిటెన్షన్ డెడ్‌లైన్ నవంబర్ 15గా ఖరారు చేసినట్లు తెలుస్తోంది.


రిటెన్షన్ అంటే.. ఆయా ఫ్రాంఛైజీలు ఏయే ఆటగాళ్లను వదిలి పెడుతున్నారో.. ఎవరిని అట్టిపెట్టుకోవాలనుకుంటున్నారో తెలిపే లిస్ట్‌ ప్రకటించాల్సి ఉంటుంది. ఇది నవంబర్ 15 లోపు జరగాలన్నమాట. ఇక ఈసారి వేలం మళ్లీ ఇండియాకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత రెండు సీజన్లలో వరుసగా దుబాయ్, జెడ్డాలో నిర్వహించారు. త్వరలోనే మినీ వేలం వేదిక, కచ్చితమైన షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.


మినీ వేలం కాబట్టి.. పెద్దగా జట్లలో మార్పులు ఉండకపోవచ్చని తెలుస్తోంది. గత సీజన్‌లో పెద్దగా పెర్ఫామెన్స్ చేయని ప్లేయర్లను వదిలి.. వారి స్థానంలో కొందరిని తీసుకోవచ్చు. ఇంకా అధిక ధరకు కొనుగోలు చేసిన ప్లేయర్లు.. అంచనాల్ని అందుకోలేని వారిని కూడా ఫ్రాంఛైజీలు వదిలేయొచ్చు. ఇక గత సీజన్‌లో అట్టడుగున నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ తమ జట్లలో ఎక్కువ మార్పులు చేసేందుకు అవకాశం ఉంది.


చెన్నై సూపర్ కింగ్స్: ఈ జట్టు సామ్ కరన్, డెవాన్ కాన్వే వంటి కీలక విదేశీ ఆటగాళ్లను విడుదల చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా విజయ్ శంకర్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి కూడా అంతగా రాణించని నేపథ్యంలో వీరిని కూడా వేలానికి వదిలేసే అవకాశం ఉంది. మరోవైపు రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించడం వల్ల సీఎస్కే పర్స్‌లో ఇప్పటికే రూ. 9.75 కోట్లు ఉన్నాయి.


రాజస్థాన్ రాయల్స్: ఈ ఫ్రాంఛైజీ విషయానికి వస్తే.. కెప్టెన్ సంజూ శాంసన్‌ను దాదాపుగా వదులుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి.. గత ఐపీఎల్ సీజన్ ముగిసినప్పటి నుంచే ఎన్నో ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. ఇక్కడ సంజూను వేలానికి వదిలేయాలా లేదా ట్రేడ్ డీల్‌కు వెళ్లాలా అనే విషయంలో రాయల్స్ ఫ్రాంఛైజీ తర్జనభర్జన పడుతోంది. ఇక్కడ ఆర్ఆర్.. లంక ప్లేయర్లు వనిందు హసరంగ, మహీష తీక్షణను కూడా వదిలేసేందుకు చూస్తున్నట్లు సమాచారం.


ఇతర ఆటగాళ్ల విషయానికి వస్తే.. టి. నటరాజన్, మిచెల్ స్టార్క్, ఆకాశ్ దీప్, మయాంక్ యాదవ్, డేవిడ్ మిల్లర్ వంటి వారు.. కొత్త ఫ్రాంఛైజీలకు వెళ్లాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఇక కేకేఆర్.. గత సీజన్ కోసం ఏకంగా రూ. 23.75 కోట్లు వెచ్చించి దక్కించుకున్న వెంకటేష్ అయ్యర్ మళ్లీ మినీ వేలంలోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక గత సీజన్‌కు గాయం కారణంగా దూరంగా ఉన్న ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ కామెరూన్ గ్రీన్.. మినీ వేలంలో ప్రధాన ఆకర్షణగా ఉండనున్నాడు. ఇప్పటికే అతని కోసం పలు ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపిస్తున్నాయి. దీంతో గ్రీన్ కోసం బిడ్డింగ్‌లో తీవ్ర పోటీ ఉండొచ్చని అంచనా వేయొచ్చు







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa