ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వెస్టిండీస్‌తో రెండో టెస్టులో జైశ్వాల్ సెంచరీ

sports |  Suryaa Desk  | Published : Fri, Oct 10, 2025, 09:58 PM

వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆటలో టీమిండియా ఆధిక్యం ప్రదర్శించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసింది. యంగ్ ఓపెనింగ్ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ .. శతక్కొట్టాడు. డబుల్ సెంచరీకి చేరువయ్యాడు. సాయి సుదర్శన్ 87 పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్ 38 రన్స్ చేసి ఔట్ అవగా.. శుభ్‌మన్ గిల్ 20 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు.


వెస్టిండీస్‌తో తొలి మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన భారత్.. క్లీన్‌ స్వీపే లక్ష్యంగా బరిలోకి దిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. బ్యాటర్లపై నమ్మకంతో తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ.. ఓపెనర్లు మంచి శుభారంభం ఇచ్చారు. తొలి వికెట్‌కు 58 పరుగులు జోడించారు. 38 రన్స్ చేసిన తర్వాత కేఎల్ రాహుల్.. వారికన్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు.


రాణించిన సుదర్శన్..


ఇక టెస్టు అరంగేట్రం చేసినప్పటి నుంచి పెద్దగా ఆకట్టుకోలేకపోయిన సాయి సుదర్శన్.. ఈ మ్యాచ్‌లో పట్టుదలతో బ్యాటింగ్ చేశాడు. వికెట్ ఇవ్వకూడదనే లక్ష్యంగా ఆచీతూచీ బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలోనే టెస్టుల్లో తొలి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అయితే సెంచరీకి చేరువవుతున్న క్రమంలో సాయి.. ఔట్ అయ్యాడు. 87 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వారికన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.


శతక్కొట్టిన జైశూ..


మరోవైపు జైశ్వాల్ మాత్రం అదరగొట్టాడు. ఈ మాత్రం బెరుకూ లేకుండా స్వేచ్ఛగా బ్యాట్ ఝుళిపించాడు. ఈ క్రమంలోనే టెస్టుల్లో తన ఏడో సెంచరీ కొట్టాడు. ఆ తర్వాత 150 పరుగుల మార్కు కూడా దాటేశాడు. ఆట చివరకు 253 బంతుల్లో 173 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. అజేయ సెంచరీతో జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. వెస్టిండీస్ బౌలర్లలో జోమెల్ వారికన్ ఒక్కడే రెండు వికెట్లు తీశాడు. మరో నలుగురు బౌలర్లు పదికి పైగా ఓవర్లు బౌలింగ్ చేసినా.. వికెట్ తీయలేకపోయారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa