ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రోఫీ నేలపై పెట్టిన శ్రేయస్ అయ్యర్!,,జాగ్రత్తగా తీసి టేబుల్‌పై పెట్టిన రోహిత్‌

sports |  Suryaa Desk  | Published : Mon, Oct 13, 2025, 10:24 PM

టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి తన వ్యక్తిత్వం, నిరాడంబరతతో మళ్లీ అభిమానుల మనసు గెలుచుకున్నాడు. అవార్డుల పట్ల, విజయాల పట్ల తనకు ఉన్నటువంటి గౌరవాన్ని మరోసారి చాటుతూ.. రోహిత్ చేసిన చిన్న పనికి ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు అభిమానులు. ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు మనం చూద్దాం.


గత వారం ముంబైలో 27వ సియట్ క్రికెట్ రేటింగ్ అవార్డ్స్ వేడుక నిర్వహించిన సంగతి తెలిసిందే. అక్కడే ఈ సంఘటన జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు భారత ప్రస్తుత, మాజీ ఆటగాళ్లు పాల్గొన్నారు. ఇందులో భాగంగా.. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ఆటగాడు, వన్డే జట్టు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పక్కపక్కనే కూర్చున్నారు. ఇక్కడ 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యుత్తమ బ్యాటింగ్ ప్రదర్శన చేసినందుకు అయ్యర్‌కు సియట్ జియో స్టార్ అవార్డ్ వచ్చింది.


ఆ అవార్డ్ అందుకొని తిరిగొచ్చి తన సీటులో కూర్చున్న శ్రేయస్ అయ్యర్.. ఆ ట్రోఫీని తన పక్కన నేలపైన ఉంచాడు. తర్వాత తను ఎటో ఆలోచిస్తూ.. అలాగే చూస్తూ ఉండిపోయాడు. దీనిని గమనించిన రోహిత్ శర్మ.. ఎవరికీ తెలియకుండా సైలెంట్‌గా ఆ ట్రోఫీని పైకి తీసి దాన్నే తదేకంగా చూస్తూ.. పక్కన ఉన్న టేబుల్‌పైన పెట్టాడు. ఎలాంటి హడావిడి చేయలేదు.


దీంతో రోహిత్ శర్మ వీడియో వైరల్ అయింది. ట్రోఫీకి విలువ ఇచ్చి నిరాడంబరంగా హిట్ మ్యాన్ చేసిన పనికి నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దీనికి మంచి మంచి కామెంట్లు చేస్తున్నారు. 'అవార్డుల విలువ తెలిసిన వ్యక్తి రోహిత్ శర్మ", 'అందుకే రోహిత్ గొప్ప నాయకుడు అయ్యాడు.' 'కెప్టెన్సీ కోల్పోయినా నీ నాయకత్వ లక్షణాల్ని మాత్రం ఏ మాత్రం మర్చిపోలేదు.' అంటూ ప్రశంసిస్తున్నారు. ఇక్కడ శ్రేయస్‌పై ఎలాంటి విమర్శలు రానప్పటికీ.. రోహిత్ వ్యక్తిత్వం మాత్రం అందరినీ ఆకట్టుకుంది.


ఇటీవల టీమ్ మేనేజ్‌మెంట్.. వన్డే కెప్టెన్సీ నుంచి రోహిత్‌ను తప్పించి.. శుభ్‌మన్ గిల్‌కు బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన తర్వాత రోహిత్ బహిరంగంగా తొలిసారి కనిపించిన ఈవెంట్ ఇదే. ఇక కొంత కాలంగా ఫిట్‌నెస్‌పై వర్క్ చేస్తున్న హిట్ మ్యాన్.. బరువు తగ్గి, ఫిట్‌గా కనిపించాడు. మరికొద్ది రోజుల్లో ఆస్ట్రేలియాతో ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌కు రోహిత్ శర్మ ఎంపికయ్యాడు. కెప్టెన్‌గా కాకుండా ఆటగాడిగా మాత్రమే కొనసాగనున్నాడు. ఈ సిరీస్ కోసం తాను తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నట్లు.. ఆ జట్టుతో ఆడటం ఎప్పుడూ సవాల్‌గానే ఉంటుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa