ఈజిప్టులో జరిగిన శాంతి సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అయ్యాయి. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాన్ని ముగిస్తూ కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చిన తర్వాత.. షర్మ్ ఎల్-షేక్ నగరంలో జరిగిన సమావేశంలో ట్రంప్ ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూనే.. పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ సరిగ్గా తన వెనుకనే నిలబడి ఉండగా ట్రంప్ భారత్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ప్రశంసించారు.
భారత్ ఒక గొప్ప దేశం అని.. అక్కడ నాయకత్వం వహిస్తున్న నా స్నేహితుడు అద్భుతంగా పని చేస్తున్నారని అన్నారు. ఈ సమయంలో షెహబాజ్ షరీఫ్ ముఖం మాడ్చుకుని ఉన్నట్లు కనిపించారు. కానీ ఆ తర్వాత ట్రంప్.. భారత్, పాకిస్థాన్ చాలా చక్కగా కలిసి జీవిస్తాయని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇలా వ్యాఖ్యానించిన వెంటనే ఆయన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వైపు చూడగా.. చిరునవ్వు నవ్వారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఇదిలా ఉండగా.. ఈ ప్రసంగానికి ముందు ట్రంప్ పాక్ ప్రధాని షరీఫ్ను, ఆయన "ఫేవరెట్ ఫీల్డ్ మార్షల్" పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ను ప్రశంసించారు. అనంతరం షరీఫ్ను సదస్సులో మాట్లాడాల్సిందిగా ఆహ్వానించారు. ప్రసంగించిన షెహబాజ్ షరీఫ్.. అధ్యక్షుడు ట్రంప్పై పొగడ్తల వర్షం కురిపించారు. మాటలతోనే ట్రంప్కు ఊపిరాడకుండా చేశారు. ట్రంప్ అలుపెరగని, అవిశ్రాంత ప్రయత్నాల కారణంగానే మధ్యప్రాచ్యంలో శాంతి సాధ్యమైందని కొనియాడారు.
భారత్, పాకిస్థాన్ల మధ్య యుద్ధాన్ని నిలిపివేయడానికి, ఆపై కాల్పుల విరమణను సాధించడానికి ఆయన చేసిన అసాధారణ, అద్భుతమైన కృషికి గాను పాకిస్థాన్ గతంలో నోబెల్ శాంతి బహుమతికి ఆయన పేరును నామినేట్ చేసిందని షరీఫ్ గుర్తుచేశారు. ఆసియాలోనే కాకుండా, మధ్యప్రాచ్యంలోనూ లక్షలాది మంది ప్రాణాలను కాపాడినందుకు ట్రంప్ను మళ్లీ నోబెల్కు నామినేట్ చేయాలని తాను కోరుకుంటున్నట్లు షరీఫ్ ప్రకటించారు.
నోబెల్ శాంతి బహుమతిని అందుకోలేకపోయినప్పటికీ.. ట్రంప్ ఇప్పటి వరకు ఏకంగా ఎనిమిది యుద్ధాలను పరిష్కరించానని, వాటిలో భారత్-పాక్ సంఘర్షణ కూడా ఉందని చెప్పుకుంటున్నారు. కానీ భారత్ మాత్రం ట్రంప్ జోక్యాన్ని నిరాకరిస్తోంది. ఇరు దేశాలే చర్చించుకుని కాల్పుల విరమణ చేసుకున్నాయని.. ఇందులో మూడో దేశం జోక్యం లేదని తేల్చి చెబుతోంది. కానీ ట్రంప్ మాత్రం పదే పదే ఏడు యుద్ధాలను ఆపినట్లు చెబుతున్నారు. తాజాగా ఇజ్రాయెల్-గాజా ఘర్షణను కూడా ఇందులో చేర్చడంతో గతంలో ఏడుగా ఉన్న సంఖ్య ఇప్పుడు ఎనిమిదికి పెరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa