సమాజంలో చోటు చేసుకుంటున్న కొన్ని సంఘటనలు చూస్తే.. మనుషుల కన్నా అడవిలో మానుగా బతకడం చాలా సురక్షితమేమో అనిపిస్తుంది. ఆడా, మగా అనే తేడా లేకుండా.. కనీసం వయసును కూడా పట్టించుకోకుండా.. రెచ్చిపోతున్నారు కొందరు మానవ మృగాలు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి.. కన్న బిడ్డల్లాగా కాపాడుకోవాల్సిన టీచర్లు కూడా.. కామంతో కళ్లు మూసుకుపోయి ప్రవర్తిస్తున్నారు. బాలికలే కాదు.. మగ పిల్లలను కూడా వదలడం లేదు. తాజాగా ఖమ్మం జిల్లాలో దారుణ సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. మూడేళ్లుగా మైనర్ బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడో ఉపాధ్యాయుడు. చివరకు బాలుడు తల్లిదండ్రులకు తెలపడంతో.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వివరాలు..
ఈ దారుణ సంఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండల పరిధిలోని ఓ గురుకుల పాఠశాలలో వెలుగు చూసింది. స్కూళ్లో విధులు నిర్వహిస్తోన్న ఓ ఉపాధ్యాయుడు.. గత మూడేళ్లుగా.. 14 ఏళ్ల బాలుడిపై లైంగికదాడికి పాల్పడుతు వస్తున్నాడు. దీని గురించి తాజాగా వెలుగులోకి వచ్చింది. బాలుడు తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న నిందితుడు.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..
మధిర మండలం, ఆత్కూరు గ్రామానికి చెందిన అరిగెల ప్రభాకర్రావు(46) అనే వ్యక్తి.. కొణిజర్ల మండల పరిధిలోని ఓ గురుకుల పాఠశాలలో ఔట్ సోర్సింగ్ టీచర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ప్రభాకర్ రావు... అక్కడ తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ బాలుడిపై గత మూడేళ్లుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. టీచర్ వేధింపుల గురించి ఇంట్లో చెప్పాలంటే భయపడ్డ విద్యార్థి.. మూడేళ్లుగా దారుణాన్ని భరిస్తూ వచ్చాడు. అయితే ఇటీవల దసరా సెలవులకు ఇంటికి వచ్చిన బాలుడు.. తిరిగి పాఠశాలకు వెళ్లడానికి నిరాకరించాడు.
తల్లిదండ్రులు అనేక విధాలుగా అడిగి చూడగా.. చివరకు తాను ఎదుర్కొంటున్న వేధింపుల గురించి వారికి తెలిపాడు. ప్రభాకర్ రావు తన పట్ల పాల్పడుతున్న దారుణం గురించి తల్లిదండ్రులకు చెప్పి బోరున ఏడ్చాడు. దీంతో బాలుడు తండ్రి ఆదివారం రాత్రి కొణిజర్ల పోలీస్స్టేషన్లో ప్రభాకర్ రావు మీద ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు అతడి మీద పోక్సో కేసు నమోదు చేశారు. అనంతరం ఈ విషయం గురించి పోలీసులు.. ప్రిన్సిపల్కు సమాచారం ఇవ్వడంతో. ఆయన ప్రభాకర్ రావుని మందలించారు. దీంతో ప్రభాకర్ రావు ఉద్యోగానికి రాజీనామా చేశాడు.
తన మీద కేసు నమోదైందనే విషయం తెలుసుకున్న ప్రభాకర్రావు.. దారుణ నిర్ణయం తీసుకున్నాడు. ఈక్రమంలో ఆదివారం రాత్రి స్వగ్రామంలోని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ వెంచర్ వద్దకు వెళ్లి పురుగులమందు తాగాడు. ఆ తర్వాత ఇంటికి కాల్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని తెలిపాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు వెంచర్ వద్దకు వెళ్లి.. ప్రభాకర్ రావుని ఆస్పత్రికి తరలించారు. ముందుగా మధిరలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉందని.. నిమ్స్కు తీసుకెళ్లాల్సిందిగా అక్కడి వైద్యులు సూచించారు. ఈక్రమంలో ప్రభాకర్ రావు.. హైదరాబాద్, నిమ్స్లో చికిత్స పొందుతూ... సోమవారం మధ్యాహ్నం మృతిచెందాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa