దీపావళి పండుగ సమీపిస్తున్న వేళ, దేశ రాజధాని ఢిల్లీలో టపాసుల వినియోగంపై సుప్రీంకోర్టు కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. పర్యావరణ హితమైన గ్రీన్ క్రాకర్స్ను పరిమితంగా కాల్చుకునేందుకు అనుమతినిస్తూ, ఈ నెల 18 నుంచి 21 వరకు నాలుగు రోజుల పాటు వెసులుబాటు కల్పించింది. అయితే, ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోకి బయటి ప్రాంతాల నుంచి టపాసులను తీసుకురావడాన్ని పూర్తిగా నిషేధించింది.ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. "బయటి నుంచి అక్రమంగా తరలించే టపాసుల వల్లే పర్యావరణానికి ఎక్కువ నష్టం వాటిల్లుతోంది. మనం పర్యావరణంతో రాజీ పడకుండా, సంయమనంతో కూడిన సమతుల్య విధానాన్ని అనుసరించాలి" అని భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది.తక్కువ ముడిసరుకులతో, ధూళిని తగ్గించేలా తక్కువ ఉద్గారాలను వెలువరించే వాటిని "గ్రీన్ క్రాకర్స్"గా పరిగణిస్తారు. ప్రస్తుతం తాము ఇచ్చిన ఆదేశాలు కేవలం తాత్కాలిక చర్య మాత్రమేనని కోర్టు స్పష్టం చేసింది. నిర్దేశించిన నాలుగు రోజుల్లో ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలోని వాయు నాణ్యత సూచీని నిరంతరం పర్యవేక్షించాలని కాలుష్య నియంత్రణ మండలి అధికారులను ఆదేశించింది. దీనిపై సమగ్ర నివేదికను తమకు సమర్పించాలని సూచించింది. ఈ నివేదిక ఆధారంగా భవిష్యత్తులో తదుపరి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa