ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాధించిన ఓ కీలక విజయంపై లోక్సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ ప్రశంసల వర్షం కురిపించారు. విశాఖపట్నంలో గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ ఏర్పాటుకు చొరవ చూపడం గొప్ప విజయమని కొనియాడారు. ఈ మేరకు ఆయన ఏపీ ప్రభుత్వానికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.వైజాగ్లో గూగుల్ హబ్ ఏర్పాటు కేవలం రాష్ట్రానికే కాకుండా, యావత్ భారత డిజిటల్ మౌలిక సదుపాయాల వ్యవస్థలో ఒక విప్లవాత్మక మార్పుకు నాంది పలుకుతుందని జయప్రకాశ్ నారాయణ అభిప్రాయపడ్డారు. ఈ చారిత్రక ఒప్పందం సాకారం కావడంలో సహకరించిన భారత ప్రభుత్వానికి కూడా ఆయన అభినందనలు తెలియజేశారు.అదే సమయంలో, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై జేపీ కీలక సూచనలు చేశారు. పెట్టుబడులను ఆకర్షించడం, మౌలిక వసతులు నిర్మించడం ఎంత ముఖ్యమో, ఆర్థిక క్రమశిక్షణ పాటించడం కూడా అంతే అవసరమని ఆయన నొక్కిచెప్పారు. రాబోయే కొన్నేళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత రెవెన్యూ వ్యయాన్ని నిలిపివేయడం దృష్టి పెట్టాలని సలహా ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతున్న కొద్దీ, పన్నుల ఆదాయం కూడా పెరుగుతుందని, ఆ సమయంలో అనవసర ఖర్చులను నియంత్రిస్తే ప్రజా అప్పులను సులభంగా అదుపులోకి తీసుకురావచ్చని ఆయన విశ్లేషించారు.ప్రస్తుతం బడ్జెట్యేతర రుణాలు, ఇంకా చెల్లించని బిల్లులను కూడా కలిపితే రాష్ట్ర అప్పులు, స్థూల రాష్ట్రోత్పత్తి నిష్పత్తి 60 శాతాన్ని దాటిపోయిందని జయప్రకాశ్ నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి ఏమాత్రం నిలకడలేనిదని, భవిష్యత్తుకు మంచిది కాదని ఆయన హెచ్చరించారు. పెట్టుబడులను ఆకర్షించడంలో చూపిన అదే పట్టుదలను, చొరవను ఆర్థిక నిర్వహణలోనూ, వనరుల వివేకవంతమైన వినియోగంలోనూ ప్రభుత్వం ప్రదర్శించాలని ఆయన ఆకాంక్షించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa