ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హెచ్-1బీ వీసా వ్యవస్థ మొత్తం ఫ్రాడ్.. వైట్‌హౌస్ సంచలన ప్రకటన

international |  Suryaa Desk  | Published : Fri, Oct 24, 2025, 10:02 PM

డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం హెచ్‌-1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని పలువురు న్యాయస్థానాల్లో సవాల్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా, ఈ అంశంపై అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ స్పందిస్తూ.. ఫీజు పెంపును సమర్దించుకుంది. హెచ్-1బీ వీసా విధానంలో మోసాలు జరుగుతున్నాయని వైట్‌హౌస్ ప్రెస్‌ సెక్రటరీ కరోలిన్‌ లీవిట్‌ అన్నారు. వ్యాజ్యాలపై న్యాయపోరాటానికి సిద్ధంగా ఉన్నామని, అమెరికన్ల ఉద్యోగాలను కాపాడటంతో పాటు వీసా వ్యవస్థను బలోపేతం చేయడమే తమ అధ్యక్షుడి తొలి ప్రాధాన్యమని లీవిట్ స్పష్టం చేశారు.


  ‘ఈ వ్యాజ్యాలు ( హెచ్-1బీ వీసా ఫీజు పెంపు)పై కోర్టులో పోరాడేందుకు మా యంత్రాంగం సిద్ధంగా ఉంది.. అమెరికా కార్మికులకు అవకాశాలు, వీసా వ్యవస్థను బలోపేతం చేయడమే మా అధ్యక్షుడి మొదటి ప్రాధాన్యత. చాలాకాలం నుచి హెచ్‌-1బీ వీసా వ్యవస్థ మోసాలతో నిండిపోయింది.. స్థానిక ఉద్యోగుల వేతనాలను తగ్గించింది. అందుకే ఈ వ్యవస్థను మెరుగుపరచాలని ట్రంప్ అనుకుంటున్నారు.. అందులో భాగంగా కొత్త విధానం అమల్లోకి తెచ్చారు. ట్రంప్ యంత్రాంగం చట్టబద్దమైన చర్యలే తీసుకుంది.. దీనిపై న్యాయస్థానంలో పోరాడేందుకు మేము సిద్ధం’ అని ఆమె ఉద్ఘాటించారు.


హెచ్-1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమెరికా ఛాంబర్‌ ఆఫ్ కామర్స్‌ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన రెండు రోజుల్లోనే వైట్‌హౌస్ ఈ ప్రకటన వెలువరించడం గమనార్హం. ట్రంప్‌ ఆదేశాలు రాజ్యాంగ విరుద్దమైనవని, కాంగ్రెస్‌ తీసుకొచ్చిన సంక్లిష్టమైన వీసా వ్యవస్థను ఇది దెబ్బతీస్తోందని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆందోళన వ్యక్తం చేసింది. హెచ్‌-1బీపై ఆధారపడిన వ్యాపార సంస్థలు, వ్యాపారులపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోందని పిటిషన్‌లో పేర్కొంది. అలాగే, పలు ఉద్యోగ సంఘాలు, యాజమాన్యాలు సైతం కోర్టులో సవాల్ చేశాయి. అటు, ట్రంప్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ అమెరికా చట్టసభ సభ్యులు లేఖ కూడా రాశారు. ట్రంప్‌ నిర్ణయం అమెరికా కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నైపుణ్యం కలిగిన విదేశీ కార్మికులను కోల్పోవాల్సి ఉంటుందని వారు ఆందోళన చెందుతున్నారు.


కాగా, హెచ్-1బీ వీసాదారుల్లో భారతీయులే అధికం. ఇటీవల ఏళ్లలో అమెరికా జారీచేసిన ఈ వీసాల్లో దాదాపు 71 శాతం భారతీయులకే దక్కినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచడం అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి దిగ్గజాలు సహా టెక్ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపనుంది. అయితే, అమెరికాలో ఎఫ్-1 వీసాపై వచ్చిన విదేశీ విద్యార్థులు ఉన్నత చదువుల తర్వాత హెచ్-1బీ వీసాకు మారితే వారికి ఫీజు ఉండదని ఇటీవల అమెరికా ఇమ్మిగ్రేషన్ విభాగం ప్రకటించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa