ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వీళ్లెక్కడి దొంగల్రా బాబూ.. రెస్టారెంట్లలో అవి మాత్రమే ఎత్తుకెళ్తారు, 2 నెలల్లోనే ఏకంగా 1100ల చోరీలు

international |  Suryaa Desk  | Published : Fri, Oct 24, 2025, 10:08 PM

సాధారణంగా రెస్టారెంట్లు, హోటళ్లు అంటే టేబుల్స్, కుర్చీలు ఉంటాయి. ఇక కొన్ని ఓపెన్ రెస్టారెంట్లు, ఓపెన్ హోటళ్లలో.. ఆరుబయటే ఈ కుర్చీలు, టేబుళ్లు వేస్తూ ఉంటారు. ఇక రాత్రి ఆ రెస్టారెంట్లు మూసివేసిన తర్వాత కూడా ఆ ఫర్నీచర్ అక్కడే ఉంటుంది. మళ్లీ తర్వాతి రోజు ఉదయం.. వాటిని శుభ్రం చేసి.. వచ్చిన కస్టమర్లకు ఆహారం వడ్డిస్తూనే ఉంటారు. సాధారణంగా ఎక్కడైనా ఇలాగే జరుగుతుంది. కానీ స్పె్యిన్‌లో మాత్రం వింత చోరీలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. రెస్టారెంట్లలో ఏర్పాటు చేసిన కుర్చీలను ఓ ముఠా ఎత్తుకెళ్లిపోతుండటం.. అక్కడి హోటల్ యజమానులకు పెద్ద తలనొప్పిగా మారింది. అయితే మాడ్రిడ్ నగరంలో గత 2 నెలల్లోనే 1100 కుర్చీలు మాయం కావడం తీవ్ర దుమారం రేపుతోంది.


స్పెయిన్‌లోని మాడ్రిడ్ నగరంలో రెస్టారెంట్, బార్ ఓనర్లను ఇప్పుడు వింత కుర్చీల దొంగతనం తీవ్ర కలవరపాటుకు గురి చేస్తోంది. మాడ్రిడ్‌తోపాటు దాన్ని చుట్టుపక్కల ప్రాంతాల్లోని రెస్టారెంట్లలో బహిరంగంగా సీటింగ్ ఏర్పాటు చేయగా.. వాటి నుంచి ఏకంగా 1100 కుర్చీలు దొంగతనానికి గురయ్యాయి. అయితే వీటిని ఎత్తుకెళ్లిన ఏడుగురు వ్యక్తులను స్పెయిన్ పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. కేవలం గత 2 నెలల్లోనే ఈ భారీ దొంగతనం జరిగినట్లు చెప్పారు. ఇక ఈ ముఠాలో ఆరుగురు పురుషులు, ఒక మహిళ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.


ఇక చోరీకి గురైన కుర్చీల విలువ 60 వేల యూరోలు అంటే మన భారత కరెన్సీలో ఏకంగా రూ.61 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో మాడ్రిడ్, దాని పక్కనే ఉన్న తలావెరా డి లా రీనా నగరంలో 18 వేర్వేరు రెస్టారెంట్లలో ఏకంగా 1100 కుర్చీలను చోరీ చేసినట్లు వెల్లడించారు. ఈ ముఠా రాత్రి వేళల్లో ఈ కుర్చీల దొంగతనాలు చేసేదని వివరించారు.


రెస్టారెంట్లు మూసివేసిన తర్వాత.. బయట పేర్చి, గొలుసులతో కట్టి ఉంచిన ఫర్నిచర్‌ను ఎత్తుకెళ్లడమే వీరి పని అని తెలిపారు. అయితే ఆయా రెస్టారెంట్లు, బార్ల వద్ద సెక్యూరిటీని ఏర్పాటు చేసినప్పటికీ.. ఈ దొంగల ముఠా ఎవరికీ అనుమానం రాకుండా కుర్చీలను దొంగిలించినట్లు గుర్తించారు.


ఇక ఆ దొంగిలించబడిన వందలాది కుర్చీలను స్పెయిన్‌లోనే కాకుండా.. మొరాకో, రొమేనియా దేశాలకు తరలించి.. అక్కడి కొనుగోలుదారులకు అమ్మేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ ఆపరేషన్‌ను ఒక క్రిమినల్ నెట్‌వర్క్‌ సమన్వయంతో చేసిందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


అయితే అరెస్ట్ అయిన నిందితులు ప్రస్తుతం దొంగతనం, క్రిమినల్ కేసులు వంటి అభియోగాలను ఎదుర్కొంటున్నారు. చిన్న చిన్న దొంగతనాలు సాధారణమే అయినప్పటికీ.. ఈ విధంగా వెయ్యికి పైగా కుర్చీలను దొంగిలించడం అసాధారణమని పోలీసులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa