ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన లావ్రే మ్యూజియంలో ఇటీవల జరిగిన భారీ చోరీ ఘటన యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ సంచలన ఘటన మరువక ముందే.. ఫ్రాన్స్లోని మరొక మ్యూజియంలో దోపిడీ జరిగింది. దాదాపుగా 2 వేలకు పైగా బంగారు, వెండి నాణేలను దొంగలు మాయం చేశారు. ముఖ్యంగా ‘ది మైసన్ డెస్ లుమైరేస్’ అనే మ్యూజియంలో ఈ దొంగతనం జరగగా... పోయిన నాణేల విలువ 90,000 యూరోలుగా ( భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ. 90 లక్షలు) ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
దొంగతనానికి గురైన ఈ నాణేలు పురాతనమైనవి. స్థానిక మీడియా అందించిన వివరాల ప్రకారం.. ఈ 2,000 వెండి, బంగారు నాణేలను 2011లో ప్రస్తుత మ్యూజియం ఉన్న భవనాన్ని పునరుద్ధరించే సమయంలో కనుగొన్నారు. అవి 1790-1840 మధ్య కాలానికి చెందినవని తెలుస్తోంది. అయితే మంగళవారం ఉదయం మ్యూజియం సిబ్బంది తలుపులు తెరిచి చూడగా.. లోపల ప్రదర్శన కోసం ఉంచిన అద్దాలు పగిలి ఉండటాన్ని గమనించి దొంగతనం జరిగినట్లుగా భావించారు. దీంతో వెంటనే పైఅధికారులు, పోలీసులకు సమాచారం అందించారు. ఇలా దర్యాప్తు బృందాలు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని.. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తును కొనసాగిస్తున్నారు.
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మోనాలిసా అసలు చిత్రం ఉన్న లావ్రే మ్యూజియంలో ఆదివారం భారీ చోరీ జరిగింది. అక్కడ దొంగిలించిన ఆభరణాల విలువ దాదాపు రూ. 895 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ దోపిడీకి సంబంధించి.. మ్యూజియంలోని నిఘా కెమెరాల పనితీరు సరిగ్గా లేదని డైరెక్టర్ లారెన్స్ డెస్ కార్స్ స్వయంగా అంగీకరించారు. ఈ దోపిడీకి పాల్పడింది ఎవరనేది ఇప్పటి వరకు స్పష్టంగా తెలియకపోయినా.. అంతర్జాతీయంగా కరుడుగట్టిన దొంగల ముఠా అయిన 'పింక్ పాంథర్స్' పని అయి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. ఇది జరిగిన కొన్ని గంటల తర్వాతే మరో మ్యూజియంలో దొంగలు పడడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa