ఈమధ్య కాలంలో చాలా మంది రెండు రెండు ఉద్యోగాలు చేస్తున్నారు. ఒక కంపెనీలో తెలియకుండా మరో కంపెనీలోనూ పని చేస్తూ డబుల్ శాలరీ కోసం కక్కుర్తి పడుతున్నారు. ఇది తప్పని తెలిసినా డబ్బుకు ఆశపడి తప్పులు చేస్తూ చిక్కుల్లో పడుతున్నారు. ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చినప్పటి నుంచి ఇది ఎక్కువైంది. అయితే భారతదేశంలో ఇలాంటివి కాస్త తక్కువే అయినా ..అమెరికాలో మాత్రం ఎక్కువగా చేస్తుంటారు. ముఖ్యంగా ఇక్కడి నుంచి వెళ్లిన ఐటీ ఉద్యోగులు.. అక్కడ రెండు రెండు ఉద్యోగాలు చేస్తుండడం మనకు తెలిసిందే. అచ్చంగా ఇలాంటి పనే చేసిన ఓ భారతీయ సంతతి వ్యక్తి.. అక్కడి అధికారులకు పట్టుబడ్డాడు.
అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రంలో భారత సంతతికి చెందిన మెహుల్ గోస్వామి అనే వ్యక్తి మూన్లైటింగ్ కేసులో అరెస్ట్ అయ్యాడు. ఒక వ్యక్తి ఒక సంస్థలో ఉద్యోగం చేస్తూ.. అదే టైంలో రహస్యంగా మరో ఉద్యోగం చేయడాన్ని మూన్ లైటింగ్ అంటారు. ఒక వ్యక్తి ఒకేసారి రెండు ఉద్యోగాలు చేయడం చట్టవిరుద్ధం. అయితే భారత సంతతికి చెందిన గోస్వామి న్యూయార్క్లో నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన న్యూయార్క్ స్టేట్ ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసెస్ లో ఉద్యోగిగా పని చేస్తున్నారు. ఇదే ఆయనకు ప్రాథమిక ఉద్యోగం.
అయితే 2022 సంవత్సరం నుంచే ఆయన మాల్టాలోని ప్రముఖ సెమీకండక్టర్ కంపెనీ అయిన గ్లోబల్ ఫౌండ్రీస్లో కాంట్రాక్టర్గా కూడా విధులు నిర్వహిస్తున్నారు. ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఇన్నాళ్లూ జాగ్రత్త పడుతూ వస్తున్నారు. కానీ ఈ తాజాగా ఈ విషయాన్ని అధికారులు గుర్తించారు. ముఖ్యంగా గోస్వామి రెండు ఉద్యోగాలను ఏక కాలంలో నిర్వహించడం ద్వారా దాదాపు రూ. 44 లక్షల (దాదాపు 50,000 డాలర్ల) విలువైన రాష్ట్ర నిధులను దొంగతనం చేశారని, పన్ను చెల్లింపుదారుల డబ్బును దుర్వినియోగం చేశారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా న్యూయార్క్లోని ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను ట్రాక్ చేసే వెబ్సైట్ సీథ్రూఎన్వై ప్రకారం.. 2024లో గోస్వామి 117,891 డాలర్ల (భారత కరెన్సీ ప్రకారం రూ.కోటికి పైగా) జీతం పొందినట్లు తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగిగా పూర్తి సమయం విధులు నిర్వర్తించాల్సిన కీలక సమయాల్లోనే గోస్వామి ప్రైవేటు కంపెనీకి కూడా పని చేస్తున్నట్లు అందిన ఈ-మెయిల్ సమాచారం ఆధారంగా అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు.
ఈ కేసుపై ఇన్స్పెక్టర్ జనరల్ లూసీ లాంగ్ తీవ్రంగా స్పందించారు. "ప్రభుత్వ ఉద్యోగులకు నిజాయతీగా సేవ చేయాలనే బాధ్యతను అప్పగిస్తారు. గోస్వామి చర్యలు ఆ ప్రజా విశ్వాసాన్ని తీవ్రంగా ఉల్లంఘించాయి. ప్రభుత్వం కోసం పని చేస్తున్నానని చెప్పుకుంటూ.. పూర్తి సమయాన్ని మరో ప్రైవేట్ కంపెనీకి కేటాయించడం అనేది ప్రజా వనరులు, ముఖ్యంగా పన్ను చెల్లింపుదారుల డబ్బును దుర్వినియోగం చేయడమే" అని ఆమె వ్యాఖ్యానించారు.
ఈ ఆరోపణల నేపథ్యంలో అధికారులు అక్టోబర్ 15న గోస్వామిని అరెస్టు చేశారు. న్యాయస్థానంలో హాజరు పరిచినప్పటికీ.. కొత్తగా సవరించిన చట్టాల ప్రకారం ఈ నేరానికి బెయిల్ నిబంధనలు వర్తించకపోవడంతో ఆయన బెయిల్ లేకుండానే విడుదల అయ్యారు. అయితే ఆయనపై నమోదైన ఈ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ఈ నేరంలో దోషిగా తేలితే.. గోస్వామికి గరిష్టంగా 15 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa