మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో విజేతగా నిలిచిన భారత మహిళల జట్టులోని ఆటగాళ్లు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఢిల్లీలోని ఆయన నివాసంలో ప్రధాని మోదీతో హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా సమావేశమైంది. ఈ సందర్భంగా వరల్డ్ కప్ విశేషాలపై చర్చించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇందులో ప్రత్యేకమైన జెర్సీని భారత టీమ్.. మోదీకి గిఫ్ట్గా ఇచ్చింది.
ఆదివారం జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్ 2025 ఫైనల్లో భారత్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికా జట్టును 52 పరుగుల తేడాతో ఓడించి.. తొలిసారి టైటిల్ సాధించింది. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి కార్యాలయం.. భారత మహిళా క్రికెట్ జట్టుకు ఆహ్వానం పలికింది. ప్రధాని మోదీతో భేటీ అయ్యేందుకు అవకాశం కల్పించింది. దీంతో బుధవారం ఆటగాళ్లంతా వెళ్లి.. మోదీని కలిశారు.
బుధవారం ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లిన భారత మహిళల జట్టు.. సాయంత్రం ఢిల్లీలోని 7 లోక్ కళ్యాణ్ మార్గ్లోని ప్రధాని నివాసానికి చేరుకుంది. అనంతరం కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ వరల్డ్కప్ ట్రోఫీతో ఫొటోలకు ఫోజులిచ్చింది. ఆ తర్వాత ప్రధాని మోదీ.. ప్రపంచ ఛాంపియన్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టీమిండియా ప్లేయర్లు.. తమ సంతకాలతో కూడిన ‘నమో’ జెర్సీని ప్రధానికి కానుకగా ఇచ్చారు.
మహిళల వన్డే ప్రపంచకప్ టైటిల్ సాధించినందుకు.. క్రికెటర్లకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ టోర్నీలో వరుసగా మూడు మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత.. పుంజుకున్న తీరు అద్భుతమని కొనియాడారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ను సైతం ఎదుర్కొని.. ఆటతోనే అన్నింటికీ సమాధానం చెప్పారని ప్రశంసించారు. ‘ఫిట్ ఇండియా’ సందేశాన్ని దేశమంతా వ్యాప్తి చేయాలని.. ఈ సందర్భంగా మోదీ హర్మన్ ప్రీత్ సారథ్యంలోని భారత జట్టుకు పిలుపునిచ్చారు. ఊబకాయం వల్ల వచ్చే సమస్యలు, ఫిట్గా ఉండటం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రచారం కల్పించాలని సూచించారు. మోదీ.. టీమిండియా ప్లేయర్లు సమావేశమైన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa