ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.కోట్లు ఇచ్చి సామాన్యులను వేటాడి చంపిన సంపన్నులు

international |  Suryaa Desk  | Published : Fri, Nov 14, 2025, 10:04 PM

యుద్ధంతో కష్టాలు పడుతోన్న ప్రజలపై జాలి, దయ చూపాల్సింది పోయి.. మానవత్వం మరిచారు కొందరు సంపన్నులు తమ సరదా కోసం భారీగా డబ్బులిచ్చి అమాయకులైన జనాలను వేటాడి ఉసురుతీశారు. వేటను ఇష్టపడేవారు అడవిలో జంతువులను, మృగాలను ఎవరైనా వేటడుతారు. కానీ, ఇక్కడ మనుషుల్నే వేటాడి మృగాలకంటే దారుణంగా వ్యవహరించారు. మానవత్వానికి మాయనిమచ్చలా నిలిచిన ఈ ఘటన దాదాపు మూడు దశాబ్దాల కిందట బోస్నియా యుద్ధంలో చోటుచేసుకోగా.. తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ సంపన్నులపై దర్యాప్తుతో నరమేధం బయటపడింది.


బోస్నియాలో 1992-95 మధ్యకాలంలో సంఘర్షణ కొనసాగింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో చరిత్రలోనే అత్యంత హింసాత్మక సాయుధ ఘర్షణగా నిలిచిన ఈ యుద్ధంలో 11 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అంతర్జాతీయ సమాజం బోస్నియా-హర్జెగోవినాను 1992 తొలినాళ్లలో గణంతంత్ర ప్రాంతంగా గుర్తించడంతో వివాదం మొదలైంది. దీనిని వ్యతిరేకించిన ‘బోస్నియా సెర్బ్స్‌’ తమ సైన్యాలతో రాజధాని సరాజెవో నగరాన్ని ఆక్రమించింది. దాదాపు మూడేళ్లకుపైగా జరిగిన ఈ యుద్ధం సమయంలో కొందరు దారుణాలకు పాల్పడ్డారు.


ఇటలీకి చెందిన సంపన్నులు డబ్బులిచ్చి సరాజెవో వీధుల్లో పౌరులను కాల్చి చంపినట్లు అంతర్జాతీయ మీడియా నివేదికలు పేర్కొన్నాయి. ‘స్నైపర్‌ టూరిజం’ పేరుతో జరిగిన ఈ నరమేధాన్ని బోస్నియా సెర్బ్స్‌ దళాలు వెనకుండి నడిపించాయని పేర్కొన్నాయి. ఇటలీ సంపన్నులను సరాజెవో చుట్టూ ఉన్న పర్వత ప్రాంతాలకు సెర్చ్స్ దళాలే తరలించాయని ఆరోపించాయి. స్నైపర్ రైఫిల్స్‌తో అమాయకులను వారు అక్కడ వేటాడి చంపినట్లు వివరించాయి. ఇందుకోసం ఆ సంపన్నులు లక్ష యూరోల వరకు (రూ.కోటి) చెల్లించాయని తెలిపాయి.


మనిషిని బట్టి రేటు ఉండేదని, చిన్న పిల్లలైతే ఎక్కువగా చెల్లించేవారని నివేదికలు వెల్లడించాయి. వృద్ధులంటే అసలు లేక్కలేదని, వాళ్లను ఉచితంగా వేటాడేందుకు అనుమతించాయని వివరించాయి. బోస్నియా యుద్ధంలో స్నైపర్‌ టూరిజానికి విదేశీ సంపన్నులు పాల్పడినట్లు గతంలోనే పలు కథనాలు వెలువడ్డాయి. దీంతో ప్రముఖ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌ ఎజియో గవాజెనీ కొన్నేళ్ల కిందట ఈ నివేదిక రూపొందించారు. కానీ, తగిన సాక్ష్యాలు, ఆధారాలు లేకపోవడంతో ఆ నివేదిక బుట్టదాఖలైంది.


ఈ నేపథ్యంలో స్లోవేనియా దర్శకుడు ‘సరాజెవో సఫారీ’ పేరుతో డాక్యుమెంటరీ చిత్రాన్ని 2022లో విడుదల చేశారు. దీని ఆధారంగా ఎజియో మళ్లీ తన ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. బోస్నియా సెర్బ్‌ ఆర్మీ అధికారి సహా అనేక మందితో మాట్లాడి వారి వాంగ్మూలాలను రికార్డుచేసి ఆధారాలతో సహా నివేదిక రూపొందించి ఇటలీ దర్యాప్తు అధికారులకు సమర్పించారు. ఆయన ఫిర్యాదు ఆధారంగా ప్రస్తుతం కేసు నమోదుచేసి అధికారులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఈ కథనాలు ఇటలీని కుదిపేస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa