ఛత్తీస్గఢ్లోని దట్టమైన అడవుల్లో పుట్టి పెరిగిన మావోయిస్టు ఉన్నత నాయకుడు హిడ్మా… దక్షిణ బస్తర్ ప్రాంతంలో ఆయన పట్టు అద్భుతంగా ఉండేది. సెంట్రల్ కమిటీ సభ్యుడిగా, డివిజనల్ కమిటీ సారధిగా దశాబ్దకాలంగా భద్రతా బలగాలకు గట్టి సవాల్ విసిరేవాడు. పలుమార్లు భారీ ఎన్కౌంటర్ల నుంచి క్షణాల వ్యవధిలో తప్పించుకుని పోలీసులకు నిద్రలేకుండా చేశాడు. “హిడ్మాను పడగొడితే మావోయిజం బస్తర్లో అంతమవుతుంది” అని ఛత్తీస్గఢ్ పోలీసులు గట్టిగా నమ్మేవారు.
గత కొన్ని నెలలుగా బస్తర్లో జరుగుతున్న వరుస ఎన్కౌంటర్లు, భారీ సంఖ్యలో మావోయిస్టుల అంతం హిడ్మాకు షాక్ ఇచ్చాయి. తన ప్రాణానికే ముప్పు పొంచి ఉందని గ్రహించిన హిడ్మా రహస్యంగా ఆంధ్రప్రదేశ్ సరిహద్దు వైపు పారిపోయాడు. తెలంగాణ-ఛత్తీస్గఢ్-ఏపీ త్రిబోర్డర్ ప్రాంతంలోని గుట్టల్లో దాక్కున్నాడని గుప్తచర వర్గాలు గుర్తించాయి. ఈ విషయం తెలిసిన వెంటనే ఏపీ గ్రేహౌండ్, ఒడిశా ఎస్ఓజీ, కేంద్ర బలగాలు అప్రమతమయ్యాయి.
గత నెల నుంచి హిడ్మా కదలికలపై ఏపీ పోలీసులు రాత్రింబగళ్లు నిఘా పెట్టారు. అతని బృందంతో పాటు రిలీఫ్ టీమ్లు, లాజిస్టిక్స్ సహకారులు… అందరి గురించి పక్కా ఇన్పుట్స్ సేకరించారు. ఎట్టకేలకు సోమవారం తెల్లవారుజామున ఆంధ్ర-ఒడిశా సరిహద్దు అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఆపరేషన్లో హిడ్మాతో పాటు అతని భద్రతా బృందంలోని పలువురు మావోయిస్టులు హతమైనట్టు అధికార వర్గాలు ధృవీకరించాయి.
హిడ్మా అంతంతో దక్షిణ భారత మావోయిజంలో ఒక యుగం ముగిసినట్టయింది. దశాబ్దకాలంగా భద్రతా బలగాలకు దీటుగా నిలిచిన ఈ గెరిల్లా యోధుడి పతనం… రాష్ట్రాల సమన్వయంతో ఎంత పటిష్ఠమైన ఆపరేషన్ జరిగిందో చూపుతోంది. ఈ విజయం ఏపీ గ్రేహౌండ్ ఖ్యాతిని మరింత ఎగరేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa