ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కఫంతో మూసుకుపోయిన గొంతు, ఛాతీని క్లియర్ చేసేందుకు ఓ బెల్లం ముక్క చాలు

Life style |  Suryaa Desk  | Published : Mon, Nov 24, 2025, 11:20 PM

చలికాలం ప్రారంభమైంది. ఇప్పటికే తీవ్ర చలిగాలులు వీస్తున్నాయి. దీంతో, చాలా మంది కఫం సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. గొంతు, ఛాతీలో కఫం పేరుకుపోయి సఫర్ అవుతున్నారు. దీంతో పాటు జలుబు, దగ్గు సమస్యలు అదనం. ఛాతీ శ్లేష్మం లేదా కఫం అనేది జలుబు, ఫ్లూ, అలెర్జీలు లేదా శ్వాసకోశ ఇన్ఫెక్షన్లతో సంబంధం ఉన్న ఒక సాధారణ లక్షణం. దుమ్ము, సూక్ష్మక్రిములను దూరంగా ఉంచడంలో కఫం రక్షణాత్మక పాత్ర పోషిస్తుంది. అయినప్పటికీ శరీరంలోని అదనపు శ్లేష్మం వాయుమార్గాలను అడ్డుకుంటుంది. దీని వల్ల దగ్గు ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా గాలి తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది.


ఆయుర్వేద నిపుణులు డాక్టర్ రాబిన్ శర్మ ప్రకారం జలుబు, కాలుష్యం, దుమ్ము తరచుగా ఛాతీలో కఫం పేరుకుపోవడానికి కారణమవుతాయి. ఇది శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగించడమే కాకుండా క్రమంగా ఊపిరితిత్తుల పనితీరును కూడా బలహీనపరుస్తుంది. ఛాతీలో కఫం తగ్గేందుకు రాబిన్ శర్మ ఓ చిట్కాను తన యూట్యూబ్ ఛానెల్‌లో షేర్ చేసుకున్నారు. ఈ చిట్కాలో ప్రధాన పాత్ర బెల్లందే. ఆ చిట్కా ఏంటి, దాన్ని తయారీ విధానం ఏంటో తెలుసుకుందాం.


కఫం తగ్గించే బెల్లం చిట్కా


చాలా మంది బెల్లం తింటే కఫం ఇంకా పేరుకుపోతుందని భావిస్తారు. అయితే, బెల్లం నుంచి కషాయాన్ని తయారు చేసుకుని తాగితే.. ఛాతీ, గొంతులో పేరుకుపోయిన కఫాన్ని తొలగించుకోవచ్చు. ఈ కషాయం తాగితే కఫం క్లియర్ అవ్వడమే కాకుండా.. దగ్గు, గొంతు నొప్పి, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ కషాయం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చుద్దాం.


కావాల్సిన పదార్థాలు


బెల్లం ముక్క - చిన్నది


అల్లం - 1/4 అంగుళాల అల్లం ముక్క తీసుకోండి


నల్ల మిరియాలు - 4 నుంచి 5


తులసి ఆకులు - 5-7


కషాయం తయారీ విధానం


కషాయం తయారీ చేయడానికి ముందుగా ఓ చిన్న బెల్లం ముక్కను తీసుకోండి. దీన్ని పొడిలా చేసుకోండి.


ఆ తర్వాత 1/4 అంగుళం అల్లం, 4-5 నల్ల మిరియాలు, 5-7 తులసి ఆకుల్ని తీసుకోండి. వీటన్నంటినీ చిన్న రోలులో వేసి బాగా దంచుకోండి.


చివరికి బెల్లం కూడా వేసి బాగా కలుపుకోండి.


ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక గ్లాస్ నీటిలో వేయండి. గ్యాస్ మీద మరిగించండి.


నీరు సగానికి తగ్గిన తర్వాత మంట ఆపి.. దానిని వడకట్టండి. ఆ తర్వాత ఖాళీ కడుపుతో గోరువెచ్చగా తాగండి.


కషాయం తాగడం వల్ల ప్రయోజనాలు


ఈ కషాయాన్ని ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో తాగడం వల్ల గొంతు, ఛాతీ నుంచి కఫం క్రమంగా బయటకు వెళ్లుతుంది. దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది.


అంతేకాకుండా శరీరం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బెల్లం, అల్లం రెండూ శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. అందుకే ఈ కషాయం శీతాకాలంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది.


బెల్లం, అల్లం యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలతో సమృద్ధిగా ఉంటాయి. ఇవి గొంతు మంటను తగ్గించడంలో సాయపడతాయి.


నల్ల మిరియాల ఘాటు గొంతును క్లియర్ చేస్తుంది. ఇక, తులసి శ్వాసకోశ సమస్యల నుంచి రిలీఫ్ అందిస్తుంది.


ఈ విషయాలు ముఖ్యం


​అమెరికన్ లంగ్ అసోసియేషన్ ప్రకారం.. మీరు కూర్చునే లేదా పడుకునే విధానం శరీరం నుంచి శ్లేష్మం తొలగించే ప్రక్రియను ప్రభావితం చేస్తుంది. నిటారుగా పడుకోవడం వల్ల రాత్రిపూట శ్లేష్మం ఎక్కువగా పేరుకుపోతుంది. బదులుగా తల, భుజాల కింద ఇంకో దిండును ఉంచి నిద్రపోండి. ఇది కఫాన్ని క్లియర్ చేయడంలో సాయపడుతుంది. పగటిపూట కూడానిటారుగా కూర్చోవడం లేదా కొద్దిగా ముందుకు వంగి ఉండటం వల్ల శ్లేష్మం క్లియర్ అవుతుంది. ఇది శ్వాసను సులభతరం చేస్తుంది.


BMC జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధన ప్రకారం.. సిగరెట్ ధూమపానం ఊపిరితిత్తుల్లోని సిలియా అని పిలువబడే చిన్న, వెంట్రుకల లాంటి నిర్మాణాలను దెబ్బతీస్తుంది. ఈ నిర్మాణాలు శ్లేష్మాన్ని తొలగించడానికి బాధ్యత వహిస్తాయి. అవి సరిగ్గా పనిచేయనప్పుడు శ్లేష్మం మరింత పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. అందువల్ల, ధూమపానానికి దూరంగా ఉండటం చాలా ముఖ్యం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa