ఎయిర్బస్ A320 నియో ఫ్యామిలీ విమానాల్లో కనిపించిన సాఫ్ట్వేర్ సమస్య కారణంగా భారత్లోని పలు ప్రముఖ విమానయాన సంస్థలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనబోతున్నాయి. ఈ సాంకేతిక లోపం పరిష్కారానికి తప్పనిసరి సాఫ్ట్వేర్ అప్డేట్ చేయాల్సి రావడంతో దాదాపు 200 నుంచి 250 విమానాల షెడ్యూల్పై ప్రత్యక్ష ప్రభావం పడనుంది. ఈ అప్డేట్ ప్రక్రియ సమయం పట్టే పని కావడంతో రాబోయే కొద్ది రోజుల్లో ఫ్లైట్ ఆలస్యాలు, రద్దులు తప్పవని అంచనా వేస్తున్నారు.
ఇండిగో, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వంటి ప్రముఖ విమానయాన సంస్థలు తమ A320 నియో ఫ్లీట్లో ఈ సమస్య ఉన్నట్లు గుర్తించాయి. ఈ మూడు సంస్థలదే దేశంలో అత్యధిక సంఖ్యలో A320 నియో విమానాలు నడుస్తున్న నేపథ్యంలో ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. ముఖ్యంగా బిజీ ఎయిర్పోర్టులైన ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్లలో గందరగోళం ఎక్కువగా కనిపిస్తుందని అంచనా.
ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని మూడు సంస్థలూ ప్రయత్నిస్తున్నట్లు ప్రకటించాయి. ఫ్లైట్ బయలుదేరే ముందు తప్పనిసరిగా లేటెస్ట్ స్టేటస్ చెక్ చేసుకోవాలని, వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా అప్డేట్స్ తెలుసుకోవాలని సూచించాయి. రీషెడ్యూల్, రీబుకింగ్, రీఫండ్ సంబంధిత అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి 24×7 కస్టమర్ కేర్ బృందం సిద్ధంగా ఉంటుందని హామీ ఇచ్చాయి.
ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ ప్రక్రియ పూర్తి కావడానికి కొన్ని రోజులు పట్టే అవకాశం ఉండగా, డిసెంబర్ మొదటి వారంలోపు పరిస్థితి సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉంది. అయితే ఈ రద్దీ సీజన్లో ప్రయాణించే వారు ముందుజాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa